పాక్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత్ ఆగ్రహం: పీవోకేపై తేల్చి చెప్పింది
న్యూఢిల్లీ: పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు అక్కడి కోర్టులు కూడా మద్దతు పలుకుతుండటం విచారకరం. గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాల(పీవోకే)ను పాకిస్థాన్ దుర్మార్గంగా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా పాకిస్థాన్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటుకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశం..
పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గిల్గిత్, బాల్టిస్థాన్ లో వచ్చే సెప్టెంబర్లో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు పాక్ కోర్టు గతవారం అనుమతిస్తూ తీర్పు చెప్పింది. దీంతో 2018 నాటి ఆదేశాల్లో సవరణలకు మార్గం సుగమం చేసింది. అంతేగాక, అక్కడ ప్రస్తుతానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
పాక్ మీ ఆకృత్యాలు తెలియనివి కావు..
కాగా, పీవోకేలో భౌతిక మార్పులకు తరచూ యత్నిస్తున్న పాక్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ తెలిపింది. ఈ ప్రాంతంపై భారత ప్రభుత్వ వైఖరి 1994లో పార్లమెంటు చేసిన తీర్మానం ద్వారా తెలియజేశామని గుర్తు చేసింది. అంతేగాక, పీవోకేను అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న విషయాల్ని పాక్ ప్రభుత్వం తాజా చర్యలతో మభ్యపెట్టలేదని భారత్ స్పష్టం చేసింది.
తేల్చిచెప్పిన భారత్..
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పీవోకేలో ఎలాంటి మార్పులను భారత్ సహించబోదని తేల్చి చెప్పింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ తోపాటు గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాలు కూడా చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి గుర్తు చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం లేవని భారత్ తేల్చి చెప్పింది.