స్వదేశీ దిశగా కేంద్రం మరో అడుగు - ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ సరుకుల విక్రయాలు బంద్
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తర్వాత స్వదేశీ తయారీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం ఇవాళ మరో అడుగు వేసింది. ఇప్పటికే ఆత్మనిర్భర్ పథకం కింద స్వదేశీ సంస్ధలను ప్రోత్సహిస్తున్న కేంద్రం.. ఆ మేరకు విదేశీ సంస్ధలను నియంత్రించాలని కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ప్రభావం ముందుగా ఆర్మీ క్యాంటీన్లపై పడింది.
దేశవ్యాప్తంగా నాలుగు వేల ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ సరుకుల కొనుగోళ్లు, అమ్మకాలను నిలిపేయాలని కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యం బాటిళ్ల సహా ఇతర వస్తువులేవీ ఆర్మీ క్యాంటీన్లలో కనిపించవు. అయితే ప్రత్యేకించి ఏ వస్తువులను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చిందే వెల్లడి కాలేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటివరకూ ఆర్మీ క్యాంటీన్లలో అత్యధిక డిమాండ్ కలిగిన విదేశీ మద్యం బ్రాండ్లు డియాగియో, పెర్నార్డ్ రికార్డ్పై భారీగా ప్రభావం పడబోతోంది.
భారత్లో మిలిటరీ క్యాంటీన్లు ఇప్పటివరకూ విదేశీ మద్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సరుకులను సైనిక బలగాలు, వారి కుటుంబాలకు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరలకు విక్రయించేవి. వీటి వల్ల మాజీ సైనికుల కుటుంబాలకు ఎక్కువగా లబ్ధి జరిగేవి. ఈ అమ్మకాల విలువ ఏటా 2 బిలియన్ల డాలర్లు ఉంటుందని ఓ అంచనా. ఆర్మీ క్యాంటీన్లు దేశంలోనే అత్యంత భారీ రిటైల్ చైన్గా కూడా గుర్తింపు పొందాయి. వాస్తవానికి కేంద్రం ఈ నిర్ణయాన్ని కరోనా సమయంలోనే అమలు చేయాలని నిర్ణయించినా అప్పటికే ఆర్మీ క్యాంటీన్లలో అప్పటికే కొనుగోలు చేసిన వస్తువులు ఉండటం, అప్పటికప్పుడు స్వదేశీ కంపెనీల నుంచి వస్తువులు కొనుగోలు చేయడం కష్టతరంగా మారడంతో తాత్కాలికంగా దీన్ని వాయిదా వేశారు. ఇప్పటికి పరిస్ధితులు కాస్త కుదుటపడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.