లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఈ గండం ఎలా గట్టెక్కేది.. రాహుల్,అభిజిత్ చెబుతున్న పరిష్కారమేంటి..
లాక్ డౌన్ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఉత్పత్తి,వస్తు సేవలు నిలిచిపోవడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాలపై ప్రభావం పడింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఉద్యోగాలు,ఉపాధి సందిగ్ధంలో పడిపోయాయి. పేదలను ఆదుకునేందుకు రూ.1.70లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనా పథకాన్ని ప్రకటించినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇంకా చాలా చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Recommended Video

ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే..
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజల చేతుల్లోకి నగదు బదిలీ జరగాలన్నారు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు నగదు బదిలీ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా అనేక చిన్న,మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. అవి దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఫలితంగా ఉద్యోగాల కోత తప్పకపోవచ్చునని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో అభిజిత్ బెనర్జీ ఏకీభవించారు. కాబట్టే ఎంతోమంది ఆర్థిక నిపుణులు ఉద్దీపన ప్యాకేజీలను సూచిస్తున్నారని తెలిపారు.

అభజిత్ బెనర్జీ ఏమన్నారు..
'అమెరికా ఇప్పటికే భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. జపాన్,యూరోప్ కూడా అదే చేశాయి. కానీ మన దేశం ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ 1శాతం జీడీపీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అమెరికా జీడీపీలో 10శాతం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది.' అని అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. మార్కెట్లో డిమాండ్ పడిపోకుండా ఉండాలంటే.. అమెరికా తరహాలో భారత్ కూడా ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బును పంప్ చేయాలన్నారు. ప్రతీ ఒక్కరికీ డబ్బు పంపిణీ చేయడం ద్వారా స్టోర్స్లో కొనుగోళ్లు పెరుగుతాయని.. కన్స్యూమర్ గూడ్స్కు డిమాండ్ పెరుగుతుందని అన్నారు.

60శాతం పేదలకు నగదు బదిలీ..
తాను కూడా ప్రజలకు నగదు బదిలీ గురించే మాట్లాడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆ డబ్బు పేదలకు చేరాలని.. అందుకు అర్హతలు నిర్ణయించడం అన్నింటికన్నా ముఖ్యమని అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జనాభాలో అట్టడుగులో ఉన్న 60శాతం మందికి నగదు బదిలీ చేయాలని.. తద్వారా జరిగే నష్టమేమీ ఉండదని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆహార సమస్యను లేవనెత్తారు. రేషన్ కార్డు లేని కారణంగా చాలామంది పేదలకు తిండికి సమస్య తలెత్తుతోందన్నారు. దానికి బెనర్జీ స్పందిస్తూ.. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్,నోబెల్ గ్రహీత ఆమర్త్య సేన్ సూచించినట్టు తాత్కాలిక రేషన్ కార్డుల పంపిణీ అవసరమన్నారు.

తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలన్న అభిజిత్..
ఇలాంటి తరుణంలో పేదలందరికీ రేషన్ కార్డులు ఉండాల్సిన అవసరం ఉందని.. లేనివారి కోసం తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలని అభిజిత్ అన్నారు. ఒక మూడు నెలల పరిమితితో రేషన్ కార్డులను ఇచ్చి.. అవసరమైతే.. ఆ తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి అవసరాలను తీర్చేందుకు మాత్రం తాత్కాలిక రేషన్ కార్డులు తప్పనిసరి అన్నారు. అంతకుముందు రఘురాం రాజన్తోనూ రాహుల్ గాంధీ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించారు. లాక్ డౌన్ కష్టాల నుంచి పేదలను గట్టెక్కించాలంటే రూ.65వేల కోట్లు అవసరమన్నారు.












Click it and Unblock the Notifications