వ్యాక్సిన్ పాస్పోర్ట్-తీవ్రంగా వ్యతిరేకించిన భారత్-ఇది వివక్షేనని తేల్చి చెప్పిన కేంద్రమంత్రి
కరోనా నేపథ్యంలో అభివృద్ది చెందిన దేశాలు 'వ్యాక్సిన్ పాస్పోర్ట్'ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అంటే,భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉన్నవారిని మాత్రమే తమ దేశాల్లోకి అనుమతిస్తాయి. ఒక వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్నాడు అని నిర్దారించేందుకు ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఒక కచ్చితమైన ప్రూఫ్ అని చెప్పవచ్చు. అయితే భారత్ లాంటి జనాభా ఎక్కువ ఉన్న,ఇంకా అభివృద్ది చెందుతున్న జాబితాలోనే ఉన్న దేశాలకు 'వ్యాక్సిన్ పాస్పోర్ట్'తో లేని చిక్కులు తలెత్తుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్రమంత్రి హర్షవర్దన్ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
జీ7 దేశాల సదస్సుకు ముందు శుక్రవారం(జూన్ 4) జరిగిన జీ7 ప్లస్ మినిస్ట్రియల్ సెషన్లో హర్షవర్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'వ్యాక్సిన్ పాస్పోర్ట్' అంశాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభాకి తగిన వ్యాక్సిన్ కవరేజ్ ఇప్పటికీ తక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ పాస్పోర్ట్ను తీసుకురావడం అభివృద్ది చెందుతున్న దేశాలపై వివక్షను చూపించనట్లవుతుంది.' అని హర్షవర్దన్ పేర్కొన్నారు.
జూన్ 11-13 తేదీల్లో జీ7 దేశాల సదస్సు జరగనుంది. ఇందులో కెనడా,అమెరికా,ఫ్రాన్స్,జర్మనీ,ఇటలీ,జపాన్,బ్రిటన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈసారి సదస్సుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ను ఆహ్వానించారు. ఈ సదస్సులో వ్యాక్సిన్ పాస్పోర్ట్ అంశాన్ని ప్రతిపాదించేందుకు బోరిస్ జాన్సన్ సిద్దమవుతున్నారు. వ్యాక్సిన్ పాస్పోర్ట్తో ఇంటర్నేషనల్ ట్రావెల్ను మరింత సులువుగా మార్చవచ్చునని గత వారం ఆయన అభిప్రాయపడ్డారు.
సాధారణంగా జీ7 సభ్య దేశాలన్ని అభివృద్ది చెందిన దేశాలే కాబట్టి వ్యాక్సిన్ పాస్పోర్ట్ విషయంలో ఆ దేశాలు అభ్యంతరం తెలపకపోవచ్చు. కానీ భారత్ లాంటి దేశాలకు ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. భారత్లో ఇస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్కు ఇప్పటికీ డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు లభించలేదు. దేశంలో ఇప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇలాంటి తరుణంలో వ్యాక్సిన్ పాస్పోర్ట్ను తప్పనిసరి చేస్తే భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు బ్రేక్ పడుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్ అభ్యంతరాన్ని జీ7 దేశాలు పరిగణలోకి తీసుకుంటాయో లేదో చూడాలి.