ఊహకు కూడా అందని రేంజ్లో: 2,61,500 కొత్త కేసులు: కరోనా కాటుకు 1501 మంది బలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా..ఊహకు కూడా అందని రేంజ్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒక్కరోజు దాటేటప్పటికీ వేల సంఖ్యలో జమ అవుతున్నాయి. కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే నిర్లక్ష్యం వల్లో లేక జనంలో పేరుకుపోయిన అలసత్వం వల్లో.. కారణాలేమైనప్పటికీ- పాజిటివ్ కేసులు మాత్రం దిగ్భ్రాంతికర స్థాయిలో పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,61,500 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,501 మంది మరణించారు. 1,28,09,643 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కి చేరింది. ఇందులో 1,28,09,643 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,77,150 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,01,316కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 12,26,22,590 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇక- కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 26,65,38,416 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 15,66,394 టెస్టింగులను నిర్వహించినట్లు తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు ఈ స్థాయిలో చెలరేగిపోతోండటంతో పలు రాష్ట్రాలు రాత్రివేళ కర్ఫ్యూను విధించాయి. వారంతపు రోజుల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. కర్ణాటక, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్ వంటి పలు చోట్ల పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉంటోంది.

కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాత్రి 8 గంటలకు అత్యవసర భేటీని నిర్వహించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ ఉదయం ఆయన మరోసారి సమీక్ష చేపట్టనున్నారు. ఈ సారి ఉత్తర ప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాశిలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి మోడీ ఆరా తీయనున్నారు. వారణాశి.. మోడీ సొంత నియోజకవర్గం. కొద్దిరోజులుగా ఇక్కడ కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పుట్టుకొస్తున్నాయి.
కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి పోటెత్తుతుడటం వల్ల వారణాశిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య ఆయన వారణాశి అధికార యంత్రాంగం, స్థానిక అధికారులతో మోడీ సమీక్ష నిర్వహిస్తారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పడకల కొరత, ఆక్సిజన్ నిల్వల గురించి మోడీ సమీక్షిస్తారు. అలాగే- రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకుని రావడంపైనా అధికార యంత్రాంగంతో చర్చిస్తారు.












Click it and Unblock the Notifications