దేశంలో లక్షకు తగ్గిన కరోనా కేసులు: మరణాల్లో అదే తీవ్రత: త్వరలో మరన్ని అన్లాక్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. లక్షకు చేరువగా క్షీణించింది. కొద్దిరోజులుగా వరుసగా లక్షన్నరకు దిగువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా ఈ సంఖ్య మరింత తగ్గుతూ వస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. మరణాల్లో మాత్రం తీవ్రత తగ్గట్లేదు. రెండున్నర వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,14,460 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,677 మంది మరణించారు. దీనికి అనుగుణంగా డిశ్చార్జీలు నమోదయ్యాయి. కొత్తగా ఒక్కరోజులో 1,89,232 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసలు కూడా భారీగా తగ్గాయి. 15 లక్షల దిగువకు పడిపోయాయి. సుదీర్ఘకాలం అనంతరం 15 లక్షలకు దిగువగా యాక్టివ్ కేసులు నమోదు కావడం పట్ల అధికారులు ఊపిరి పీల్చుకుంటోన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339కు చేరింది. ఇందులో 2,69,84,781 మంది కోలుకున్నారు. 3,46,759 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 14,77,799గా రికార్డయింది. గరిష్ఠంగా ఈ సంఖ్య 38 లక్షలకు చేరువగా వెళ్లిన విషయం తెలిసిందే. రోజువారీ కరోనా కేసులు తగ్గుతూ రావడం, అదే సమయంలో డిశ్చార్జీలు రెట్టింపు నమోదవుతోన్న ప్రభావం యాక్టివ్ కేసులపై పడింది. ఫలితంగా అవి తగ్గుముఖం పడుతున్నాయి. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 23,13,22,417 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
Recommended Video
కరోనా వైరస్ తీవ్రత తగ్గిన ఢిల్లీ ఇప్పటికే అన్లాక్ చర్యలను ప్రారంభించింది. తొలి విడతలో పరిశ్రమలను పునరుద్ధరించడానికి, భవన నిర్మాణ పనులు కొనసాగించడానికి వెసలుబాటు కల్పించింది. రెండోవిడతలో 50 శాతం ఆక్యుపెన్సీతో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించడానికి అనుమతి ఇచ్చింది. ఒక్కోవారం దాటే కొద్దీ- అన్లాక్ చేస్తూ వస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. కాగా- మహారాష్ట్ర కూడా అన్లాక్ చేపట్టింది. ఈ నెల 14వ తేదీ నుంచి కర్ణాటక సైతం అన్లాక్ ప్రక్రియను ఆరంభించే అవకాశాలు ఉన్నాయి. కేసుల తీవ్రతను మరింత తగ్గించడానికి తెలంగాణ, తమిళనాడు, గోవా వంటి కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించాయి. మరో దఫా ఉండకపోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications