ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్డౌన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన్నాయి. డెల్టా ప్లస్, కప్పా వేరియంట్లు కొంత ఆందోళనకరంగా మారినప్పటికీ.. వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. కరోనా తీవ్రత సద్దుమణిగుతోన్నప్పటికీ- మహారాష్ట్ర, కేరళల్లో పరిస్థితులు కొంత కలవరానికి గురి చేస్తోన్నాయి. కొత్త కేసులు అధికమౌతోన్నాయి. పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుదల బాట పట్టింది.
Viral video: యూపీ పంచాయతీ ఎన్నికల్లో హింస: మహిళ అభ్యర్థిని వివస్త్రను చేసే ప్రయత్నం
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 41,506 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి దాదాపు సమానంగా డిశ్చార్జీలు నమోదయ్యాయి. 41,526 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 853 మంది మృతిచెందారు. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. నాలుగున్నర లక్షలకు పడిపోయాయి. ఇప్పటి వరకు 2,99,75,064 మంది డిశ్చార్జ్ అయ్యారు. 4,08,040 మంది మృత్యువాత పడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,22,821, బ్రెజిల్-5,32,949 మంది మరణించారు. ఆ తరువాతి స్థానం భారత్దే. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 37,60,32,586 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది. దేశంలో నమోదవుతోన్న రోజువారీ కేసుల్లో 30 శాతం వాటా మహారాష్ట్ర, కేరళలదే. ఈ రెండు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు థర్డ్వేవ్ను సూచిస్తోన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
కరోనా తీవ్రతను నివారించడానికి కేరళ ప్రభుత్వం వారాంతపు రోజుల్లో లాక్డౌన్ అమలు చేస్తోంది. రాజధాని తిరువనంతపురం సహా పలు నగరాల్లో ఈ ఉదయం లాక్డౌన్ ఆరంభమైంది. కేరళలో ఇప్పుడున్న కరోనా చాలదన్నట్లు కొత్తగా జికా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పినరయి విజయన్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళతో సరిహద్దును పంచుకుంటోన్న కర్ణాటక కూడా అప్రమత్తమైంది. కేరళ సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్ను ప్రకటించింది.