కట్టు తప్పినట్టే: 50 వేలకు చేరువగా కరోనా కేసులు: దెబ్బ కొడుతోన్న ఆ రెండూ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. మరోసారి 50 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో.. అలాంటి వాతావరణం ఏర్పడిందా? అనే అనుమానాలను కలిగిస్తోన్నాయి తాజా పరిణామాలు. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందనే సంకేతాలను పంపించినట్టయింది.
30 వేలకు పైగా..
దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ సంఖ్యలో కేసులు నమోదవుతోన్నప్పటికీ- రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రం అసాధారణంగా ఉంటోంది కరోనా తీవ్రత. కేరళ, మహారాష్ట్రల్లో రోజువారీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి కేరళలో కరోనా విజృంభణ అధికంగా ఉంటోంది. 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయక్కడ. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్యతో పోల్చుకుంటే.. సగానికి పైగా ఆ ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతోన్నాయి. దీని తరువాత మహారాష్ట్రలో అధిక కేసులు రికార్డవుతోన్నాయి.
అదుపులో లేని కరోనా..
డెల్టా ప్లస్ వేరియంట్ కొంత ఆందోళనను కలిగిస్తోన్నప్పటికీ.. దాని పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి. నియంత్రణా చర్యలను తీసుకుంటోన్నాయి. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తూ వస్తోన్నాయి. ఫలితంగా- దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యలో అదుపులోనే ఉంటోంది గానీ.. కేరళలో మాత్రం కట్టు తగ్గట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ను కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోంది.
45 వేలకు పైగా..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 45,083 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 460 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 35,840 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 97.53 శాతంగా నమోదైంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరింది. ఇందులో 3,18,88,642 మంది కోలుకున్నారు. 4,37,830 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,558గా నమోదైంది.
మరణాల్లో మూడో స్థానంలో..
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,37,830 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,54,381, బ్రెజిల్-5,79,052 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్లను వేసుకున్న వారి సంఖ్య 60 కోట్లను దాటేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
అక్కడ వీకేండ్ లాక్డౌన్
కరోనా తీవ్రత కేరళ, మహారాష్ట్ర వంటి రెండు, మూడు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేరళ ప్రభుత్వం వీకెండ్ డేస్లల్లో లాక్డౌన్ను అమలు చేస్తూ వస్తోంది. శని, ఆదివారాల్లో కొన్ని నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్ను విధిస్తోంది. ఇదే తరహా నివారణ చర్యలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. థర్డ్వేవ్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది.
ప్రొటోకాల్స్ పొడిగింపు..
కోవిడ్ ప్రొటోకాల్స్ను పొడిగించింది. పండగల సీజన్ ఆరంభం కావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. కరోనా లక్షణాలు కనిపిస్తే- వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, ఈ విషయంలో అశ్రద్ధగా ఉండొద్దని చెబుతోంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న కేరళపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు అధికారులు పేర్కొన్నారు.