పిన్న వయసు సీఈఓ... రికార్డు సృష్టించిన చెన్నై బాలిక
న్యూఢిల్లీ: 16 సంవత్సరాలకే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన చెన్నైకి చెందిన బాలిక సింధూజ రాజరామన్, పిన్న వయసు సీఈఓగా రికార్డులకెక్కింది. తన తండ్రి స్థాపించిన సెప్పన్ అనే యానిమేషన్ కంపెనీకి ఆమెను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించడంతో ఈ రికార్డు సాధించింది.
దీంతో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ సర్వీస్ కంపెనీస్ సింధూజకు పిన్న వయసు సీఈఓగా గుర్తింపునిచ్చింది. కార్టూనిస్ట్గా పనిచేస్తున్న తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను సీఈఓగా బాధ్యతలు చేపట్టగలిగానని ఆమె చెబుతోంది.
భారత్కు చెందిన ప్రఖ్యాత కంపెనీలకు సినిమాలు, వ్యాపార ప్రకటనలు రూపొందించే 18 మంది సభ్యుల బృందానికి ఆమె నేతృత్వం వహిస్తోంది. ప్రపంచంలోనే పిన్న వయసు డిజిటల్ క్యారికేచరిస్ట్గా కోరల్ సంస్థ ఆమెను గుర్తించింది.
ఇదివరకే నాస్కామ్ 2డీ యానిమేటర్ అవార్డును కూడా సింధూజ కైవసం చేసుకుంది. సొంతంగా సంస్థను నిర్మించి సినిమా ప్రోడక్ట్స్ను విశ్వవ్యాప్తంగా అందించాలన్నది తన కోరిక అని ఆమె అంటోంది.