షాక్: దేశంలో బ్లాక్మనీ రూ.30లక్షల కోట్లు, జీడీపీలో 20శాతం!
న్యూఢిల్లీ: నల్లధనంపై ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా భారత్లో దాని వాటా గణనీయంగానే ఉంది. దేశంలో కొన్నేళ్లుగా నల్లధనం తగ్గుతూ వస్తున్నా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పరిమాణంకన్నా ఎక్కువగానే ఉండటం గమనార్హం. భారత్లో ప్రస్తుతం నల్ల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.30లక్షల కోట్లకు పైగా ఉంది.
ఇది మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 20శాతం కావడం గమనార్హం. కాగా, మరోవైపు నల్లధనంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా స్థిరాస్తి, పుత్తడి రంగాల్లో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

యాంబిట్ క్యాపిటల్ రీసెర్చి నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నల్లధనంపై నియంత్రణ చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని ఈ అధ్యయనం పేర్కొంది. నల్ల ఆర్థికవ్యవస్థ (బ్లాక్ ఎకానమీ)లో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి మూలధన వ్యయం పెరిగిందని వెల్లడించింది.
భౌతిక రూపంలోని నగదుకు ప్రాధాన్యం పెరిగిందని, బ్యాంకుల లావాదేవీలను ఉపయోగించుకోవడం గణనీయంగా తగ్గిందని తెలిపింది. డిపాజిట్ల వృద్ధి బాగా తగ్గిందని, డెబిట్ కార్డుల వినియోగం తగ్గిందని పేర్కొంది. ఫలితంగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది.
1970లు, 1980ల్లో భారత నల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించిందని అధ్యయనం వెల్లడించింది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలిపింది. అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా కాకుండా బయట జరిగే ఆర్థిక కార్యకలాపాలను నల్ల ఆర్థికవ్యవస్థగా పేర్కొంటున్నారు.
'2016లో భారత జీడీపీ దాదాపు రూ.1,50,00,000 కోట్లు అని అంచనా వేయగా, దేశంలోని నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.30లక్షల కోట్లకు పైనే. థాయ్లాండ్, అర్జెంటీనా వంటి దేశాల జీడీపీ కన్నా ఇది ఎక్కువ.' అని అధ్యయనం పేర్కొంది. నల్లధనంలో ఎక్కువ భాగం బంగారం, స్థిరాస్తి వంటి భౌతిక ఆస్తుల్లో ఉన్నట్లు వెల్లడించింది.
భారత్లో ఆర్థికసాధనాల్లో పొదుపు చేయడం కన్నా భౌతిక ఆస్తుల రూపేణా పొదుపు చేయడానికి ప్రాధాన్యం ఎక్కువ. భౌతిక ఆస్తుల కొనుగోలుకు నల్లధనాన్ని ఉపయోగించుకోగల్గడమే ఇందుకు కారణం. రికార్డుల్లో నమోదు అవుతుంది కాబట్టి ఆర్థికసాధనాల్లో మదుపు చేయడానికి నల్లధనాన్ని ఉపయోగించలేరు. స్థిరాస్తి రంగంలో నల్లధనం ఎంత పరిమాణంలో ఉన్నదీ అధికారిక గణాంకాలు లేనప్పటికీ భారత స్థిరాస్తి రంగంలో నల్లధనం వాటా 30శాతం వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు..
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారం లావాదేవీలపై తనిఖీలు పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. లెక్కలు చూపించని నగదును నగలు, బంగారం కొనుగోళ్లలో పెట్టుబడిగా పెట్టడం బాగా కష్టంగా మారిందని వివరించింది.
నల్లధనాన్ని కఠినంగా నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా భూమి, స్థిరాస్తి ధరల్లో తగ్గుదల స్పష్టంగా ఉందని, బంగారం కొనుగోలుపైనా ఆసక్తి తగ్గిందని వెల్లడించింది. నల్లధనంపై నియంత్రణ చర్యల వల్ల అనుకోని ఫలితాలు ఎదురయ్యాయని పేర్కొంది.
'నల్ల ఆర్థికవ్యవస్థలో వడ్డీ రేట్లు పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు అందుబాటు తగ్గడం కారణంగా భారత్లో రుణం ద్వారా సమకూర్చుకునే మూలధన వ్యయం గత 12 నెలల కాలంలో సగటున 30 బేసిస్ పాయింట్లు పెరిగింది. పాలసీ రేట్లపై 100 బేసిస్ పాయింట్ల కోత పడినా రుణ మూలధన వ్యయం పెరిగింది' అని వెల్లడించింది.












Click it and Unblock the Notifications