కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..
లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,892కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బాధితుల గుర్తింపులో కీలకమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అనూహ్య హెచ్చరికలు జారీచేసింది. రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ హెడ్ సైంటిస్ట్ రమణ్ గంగాఖేడ్కర్, ఇతర అధికారులు సోమవారం మీడియాతో మాట్లాడారు.

కేసులు పెరిగినా..
తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 27,892కు పెరగగా, అందులో 872 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం గమనార్హమని, 22.17 శాతం రికవరీ రేటుతో ఇప్పటిదాకా 6,185 డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర అధికారులు చెప్పారు. తొలిదశలో కేసులు నమోదైన 16 జిల్లాల్లో వ్యాప్తి తగ్గుముఖంపట్టడంతో గత 28 రోజులుగా ఒక్క కేసూ నమోదుకాలేదని, మరో 85 జిల్లాల్లో గడిచిన 14 రోజులుగా ఒక్కరు కూడా ఇన్ఫెక్షన్ కు గురికాలేదని ప్రకటించారు.

వాళ్ల ద్వారా వైరస్ వ్యాప్తి?
కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల ద్వారా మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. రికవరీలపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం అసలే లేదని ప్రజలకు సూచించింది. నిజానికి కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులు.. మిగతా రోగులపాలిట వరంగా మారారని, వాళ్లు చేస్తున్న ప్లాస్మా దానాలతో ఎంతో మంది ప్రాణాలు నిలబడుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారి అగర్వాల్ అన్నారు. ఫలానా ఏరియా లేదా కమ్యూనిటీ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందనే హెచ్చరికల పోస్టర్లు కూడా అంటించడానికి వీల్లేదని ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన సూచించారు.

ఆ చైనా కిట్స్ వాడొద్దు..
అధిక జనాభా కలిగిన ఇండియాలో యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా కరోనా టెస్టుల్ని వేగవంతంగా నిర్వహించే కార్యక్రమం ముందుకు సాగుతున్నా, ఊహించని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య రాజస్థాన్ ప్రభుత్వం.. కొరియా నుంచి తెప్పించిన కిట్స్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేయడంతో ఐసీఎంఆర్.. రెండ్రోజులపాటు కిట్స్ వాడకాన్ని నిలిపేసింది. తాజాగా చైనాకు చెందిన ఓ రెండు కంపెనీల టెస్టింగ్ కిట్స్ పై పూర్తిగా నిషేధం విధించింది. Guangzhou Wondfo Biotech, Zhuhai Livzon Diagnostics కంపెనీల నుంచి తెప్పించిన కిట్స్ ను వాడరాదంటూ రాష్ట్రాలను ఆదేశించింది. ఇవిపోను, సరిపడా టెస్టింగ్స్ అందుబాటులో ఉన్నాయని కేంద్రం భరోసా ఇచ్చింది.

రెడ్ జోన్లలోనే లాక్ డౌన్ కొనసాగింపు..
లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెర్స్ లో ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారని, మే 3 తర్వాత వైరస్ ఉధృతి తీవ్రంగా ఉన్న రెడ్ జోన్ ఏరియాల్లో సడలింపులకు అవకాశం ఇవ్వొద్దని, అయితే, వైరస్ ప్రభావం తక్కువగా ఉండే ఆరెంజ్ జోన్లు, అసలు ప్రభావమేలేని గ్రీన్ జోన్లలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయాలనే కంక్లూజన్ కు వచ్చినట్లు రిపోర్టులు వస్తున్నాయి. దీనిపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications