కరోనా: 90 మంది వైద్య సిబ్బందికి వైరస్.. అమెరికాకు కిట్స్ పంపడంతో మనకు కొరత.. షాకింగ్ నంబర్స్
దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 909 కేసులు వచ్చాయని, దీంతో మొత్తం సంఖ్య కూడా అమాంత పెరిగినట్లయిందని పేర్కొంది. ఆదివారం సాయంత్రం నాటికి మొత్తంగా 8,356 కేసులు నమోదుకాగా, అందులో 764 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 273 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరణాలు పెరిగే చాన్స్..
కాగా, యాక్టివ్ గా ఉన్న 7409 కేసుల్లో20 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, మరో 1671 మంది క్రిటికల్ కండిషన్ లో వెంటిలేటర్ పై ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. అయితే, కేసులు పెరిగినప్పటికీ, ఆ మేరకు చికిత్స అందించే ఏర్పాట్లు పక్కాగా పూర్తిచేశామని, ఇప్పటికే 601 ఆస్పత్రుల్ని కొవిడ్-19 రోగుల కోసం మాత్రమే వాడుతున్నామని, మొత్తంగా 1లక్ష ఐదువేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, ఎయిమ్స్, నిహాన్స్ లాంటి మెంటర్ సంస్థల్లోనూ ఇకపై కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.

టెస్టింగ్ కిట్స్ కొరత..
కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మాత్రం భిన్నంగా స్పందించింది. టెస్టింగ్ కిట్స్ అందుబాటులో లేని కారణంగా కనీసం క్లస్టర్ ఏరియాల్లో కూడా సెరోలాజికల్ పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని పలు రాష్ట్రాలు ఫిర్యాదులు చేస్తున్నాయని ఐసీఎంఆర్ ఆరోపించింది. మన దగ్గరున్న టెస్టింగ్ కిట్స్ ను అమెరికాకు పంపడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనికి వెంటనే పరిష్కారం చూపాలని పేర్కొంది.

వైద్య సిబ్బందికి వైరస్ కాటు..
టెస్టింగ్ కిట్స్ కొరతతోపాటు వైద్య సిబ్బంది రక్షణ సదుపాయాలపైనా అనుమానాలు రేకెత్తుతున్నవేళ.. దేశవ్యాప్తంగా మొత్తం 90 మంది డాక్టర్లు, నర్సులు వైరస్ బారినపడ్డారన్న వార్త సంచలనం రేపుతున్నది. పుణెలో ఓ నర్సు.. సెలవుపై వెళ్లి, తిరిగి డ్యూటీలో చేరిన రెండ్రోజులకే వైరస్ లక్షణాలు కనిపించడం, ఆమెకు టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలోని 30 మంది నర్సుల్ని క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు చెప్పారు. వైరస్ బారినపడ్డ మిగతా డాక్టర్లు, నర్సులు ఎక్కడివారనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

అమెరికాసహా 13 దేశాలకు HCQ..
కొవిడ్-19 వ్యాధికి ఇంకా మందు అందుబాటులోకి రాకపోవడంతో, ప్రత్యామ్నాయంగా మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్(HCQ) వినియోగిస్తున్నారు. HCQ, పారాసిటమాల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఇండియాను.. అమెరికా సహా పలు దేశాలు అభ్యర్థించడం తెలిసిందే. విమానంలో పంపిన మందులు.. శనివారమే అమెరికాలో ల్యాండ్ అయ్యాయి. ఆదివారం నాటికి మొత్తం 13 దేశాలకు HCQ సరఫరా చేశామని, దేశీ అవసరాల కోసం సరిపడా నిల్వలు చూసుకున్న తర్వాతే మందుల్ని ఎగుమతి చేశామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కేఎస్ దత్వాలియా చెప్పారు.

వేగంగా వ్యాప్తి..
దేశంలో మొత్తం 736 జిల్లాలు ఉండగా, అందులో 400 జిల్లాల్లో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించిన కొద్ది గంటలకే సీన్ తారుమరయ్యే పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం నాటికి కొత్తగా 80 జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో భౌగోళికంగా సగం దేశం వైరస్ కబ్జాలోకి వెళ్లినట్లయింది. 62 జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.












Click it and Unblock the Notifications