భారత తొలి కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ 2021లోనే! 14 రాష్ట్రాల్లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అనేకమంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యారు. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలు వ్యాక్సిన్ తయారీలో ముందడుగు వేస్తున్నాయి. భారత్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్..
హైదరాబాద్ నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్పైనే దృష్టి సారించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) బాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్'ను అభివృద్ధి చేస్తోంది.
2021 రెండో త్రైమాసికంలో కోవాగ్జిన్..
పూర్తి సమర్థత, భద్రతకు సంబంధించిన తుది దశ క్లినికల్ ట్రయల్స్లో ఖచ్చితమైన రుజువు లభించడం, నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చేస్తామని భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ సాయి ప్రసాద్ వెల్లడించారు. దీంతో 2021 రెండో త్రైమాసికంలోనే వ్యాక్సిన్ విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు.
రూ. 400 కోట్ల ఖర్చుతో కోవాగ్జిన్..
వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా, వచ్చే ఆరు నెలల్లో వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి కావాల్సిన సదుపాయాల కోసం దాదాపు 400 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వీటిని ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. విదేశాల్లోనూ వ్యాక్సిన్ మార్కెట్ చేసే అవకాశాలపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతానికి డోసు ధరను నిర్ణయించలేదని తెలిపింది.
14 రాష్ట్రాల్లో మూడో దశ ట్రయల్స్
కాగా, కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ ఇటీవలే అనుమతి పొందింది. వాలంటీర్ల ఎంపకి, వ్యాక్సిన్ ప్రయోగాలను నవంబర్ నెలలోనే ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తెలిపింది. దీని కోసం 13-14 రాష్ట్రాల్లో దాదాపు 25-30 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఆస్పత్రి నుంచి దాదాపు 2వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వాలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్లు పేర్కొంది.