గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ: మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్కు కరోనా కాటు: 103 ఏళ్ల వయస్సులో
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోంది. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రముఖులు సైతం కరోనా కాటు నుంచి తప్పించుకోవట్లేదు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వైద్యరంగ నిపుణులు కరోనా వైరస్ బారిన పడి కన్నుమూశారు. దేశ మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఐ పద్మావతి కరోనా వైరస్ వల్ల కన్నుమూశారు. ఆమె వయసు 103 సంవత్సరాలు. కరోనా వైరస్ సోకిన తరువాత ఆమె నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఎన్హెచ్ఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓపీ యాదవ్ తెలిపారు. రెండు ఊపిరితిత్తులలోనూ తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడిందని తెలిపారు. పద్మావతి మరణానికి అదే కారణమైందని చెప్పారు. రెండురోజులుగా వెంటిలేటర్పై చికిత్స అందించామని, అయినప్పటికీ.. ఫలితం రాలేదని అన్నారు. వైద్యానికి ఆమె శరీరం స్పందించడం మానేసిందని చెప్పారు. ఆమె భౌతికకాయానికి ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలోని పంజాబీ బాగ్ శ్మశాన వాటికలో నిర్వహించారు.
103 సంవత్సరాల వయసులోనూ ఆమె ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపారు. 2015 చివరి వరకు కార్డియాలజిస్ట్గా సేవలను అందించారు. నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకురాలిగా పేరు తెచ్చుకున్నారు. 1981లో నెలకొల్పిన ఈ ఇన్స్టిట్యూట్లో రోజూ 12 గంటల పాటు పనిచేసేవారని ఓపీ యాదవ్ తెలిపారు. వైద్యరంగంలో గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీగా గుర్తింపు పొందారు. 1967లో మౌలానా ఆజాద్ వైద్య కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్గా పనిచేశారు.
Recommended Video
ఇర్విన్ అండ్ జీబీ పంత్ ఆసుపత్రితో కలిసి హృద్రోగంలో పరిశోధనలు కొనసాగించారు. 1962 ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ను స్థాపించారు. వైద్యరంగంలో ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కరోనా వైరస్ వల్ల ఇప్పటికే పలువురు ప్రముఖులు కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్లో ఇద్దరు కేబినెట్ మంత్రులు మరణించారు. కమలా రాణి వరుణ్, చేతన్ చౌహాన్ కరోనాకు బలి అయ్యారు.