భారతదేశంలో తొలి మంకీపాక్స్ మరణం: యూఏఈ నుంచి కేరళకు వచ్చిన బాధితుడు
తిరువనంతపురం: భారతదేశంలో తొలి మంకీపాక్స్ మరణం సంభవించింది. కేరళలోని త్రిస్సూర్లో శనివారం మరణించిన యువకుడికి మరో దేశంలో మంకీపాక్స్ సోకి పాజిటివ్గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇది భారతదేశం మొదటి మంకీపాక్స్ మరణం, ఆఫ్రికా వెలుపల నాల్గవది.
త్రిస్సూర్లోని పున్నియూర్కు చెందిన 22 ఏళ్ల యువకుడు యూఏఈ నుంచి తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. తదనంతరం, ఆరోగ్య శాఖ అతని నమూనాలను అలప్పుజాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కేరళ యూనిట్కు పంపింది.
విదేశాల్లో నిర్వహించిన పరీక్షలో యువకుడికి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిందని, అయితే అతని కుటుంబ సభ్యులు పరీక్ష ఫలితాలను శనివారం మాత్రమే ఆసుపత్రి అధికారులకు అందజేశారని మంత్రి తెలిపారు. "యువకుడిలో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు లేవు. మెదడువాపు, అలసట లక్షణాలతో అతను ఆసుపత్రిలో చేరాడు. అతని బంధువులు శనివారం మాత్రమే పరీక్ష ఫలితాలను అందజేశారు. మంకీపాక్స్ చాలా తక్కువ మరణాల రేటును కలిగి ఉన్నందున మరణంపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతుంది' అని మంత్రి తెలిపారు.
యువకుడు జూలై 22న యూఏఈ నుంచి కేరళకు చేరుకున్నాడని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. "అతను ఇంటికి చేరుకున్న తర్వాత చురుకుగా ఉన్నాడు. స్థానిక మైదానంలో ఫుట్బాల్ ఆడాడు. జూలై 26న, అతనికి జ్వరం వచ్చి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తరువాత, అతను మరొక ఆసుపత్రికి తరలించబడ్డాడు. అక్కడ అతనికి లైఫ్ సపోర్ట్ ఉంచవలసి వచ్చింది. అతను కేరళకు విమానం ఎక్కే ముందు యూఏఈలో పరీక్ష చేయించుకున్నాడని పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం యువకుడు మృతి చెందాడు. మంకీపాక్స్ బాధితుల ప్రోటోకాల్ ప్రకారం అతని అంత్యక్రియలు జరిగాయి. అతని ప్రాథమిక పరిచయాలన్నీ పరిశీలనలో ఉంచబడ్డాయి. కాగా, ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి.