గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ట్రంప్ తిరస్కరణ
2019 దేశ గణతంత్ర ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించింది భారత్. అయితే భారత ఆహ్వానాన్ని ట్రంప్ తిరస్కరించారు. భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని వైట్ హౌజ్ వర్గాలు ఈ ఏడాది ఆగష్టులో స్పష్టం చేశాయి. అప్పుడే ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి ఉంటే పెద్దగా చర్చజరిగేది కాదేమో. కానీ ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు భారత ఆహ్వానాన్ని తిరస్కరించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
భారత్ ఇరాన్ల మధ్య సంబంధాలు, భారత్ రష్యాతో ఎస్ 400 క్షిపణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై అమెరికా గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ భారత ఆహ్వానాన్ని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ పై ఆంక్షలు విధించిన అమెరికా ఆ దేశం నుంచి ఎలాంటి వాణిజ్య సంబంధాలు నెరపరాదని భారత్కు సూచించింది. దీంతో అమెరికా భారత్ల మధ్య కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇండియా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై కూడా అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయుధాలు కొనుగోలు చేయరాదని కూడా భారత్కు సూచించింది. అయితే భారత రక్షణ వ్యవస్థలో అధిక శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలే ఉన్నాయి. దీనిపై భారత్ అమెరికాల మధ్య చర్చలు జరిపిన తర్వాత భారత్పై ఆంక్షలను సడలించింది అగ్రరాజ్యం. ఇక ఇరాన్ నుంచి పలు దేశాలు ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని నిలపివేసేందుకు నవంబర్ 4న డెడ్ లైన్ విధించింది అమెరికా. కానీ అమెరికా ఆదేశాలను భారత్ బేఖాతరు చేస్తూ ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతిని కొనసాగిస్తోంది.