భారత్ రాకున్నా మాకొచ్చిన నష్టమేమి లేదు: బెల్ట్&రోడ్ సమ్మిట్లో చైనా!
చైనా మాత్రం భారత్ వచ్చినా.. రాకున్నా.. తమకు కలిగిన నష్టమేమి లేదని వాదించడం గమనార్హం.
చైనా: పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాన్ని అయిదో రాష్ట్రంగా ప్రకటించాలని పాకిస్తాన్ చాలాకాలంగా కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనికి వంత పాడుతూ చైనా సైతం.. ఆ భూభాగాన్ని పాక్ ఎకనమిక్ కారిడార్ లోనే ఉన్నట్లు చూపిస్తోంది.
భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించేలా చైనా పాల్పడుతున్న చర్యల పట్ల భారత్ తన నిరసన వ్యక్తం చేసింది. చైనాలో నిర్వహించిన వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమానికి వెళ్లకుండా తన నిరసన తెలిపింది. చైనా మాత్రం భారత్ వచ్చినా.. రాకున్నా.. తమకు కలిగిన నష్టమేమి లేదని వాదించడం గమనార్హం.
చైనాలో రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి 29దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ ఈ కార్యక్రమానికి గైర్హాజరవడంతో.. అక్కడి మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్ రాకపోవడం వల్ల వచ్చిన నష్టమేమి లేదని, అయితే భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే పని చైనా ఎప్పటికీ చేయదని ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ఒక కాలమ్ ద్వారా ప్రకటించారు.