మోడీ దౌత్యం ఫలిస్తోంది, భారత్ దూకుడు: చైనా ప్రశంసలు, పాకిస్తాన్ విషయంలో హెచ్చరిక
బీజింగ్: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత విదేశీ విధానం మరింత దృఢంగా, శక్తిమంతంగా తయారయిందని చైనా పేర్కొంది. భారత భవిష్యత్తు కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. ఈ మేరకు చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఐఐఎస్) ఉపాధ్యక్షులు రాంగ్ యింగ్ పేర్కొన్నారు.
రాంగ్ యింగ్ గతంలో భారత్లో చైనా దౌత్యాధికారిగా కూడా పని చేశారు. ఈ మేరకు సీఐఐఎస్ జర్నల్లో ఓ కథనం రాశారు. మోడీ ప్రభుత్వంపై ఇలాంటి కథనం రావడం ఇదే తొలిసారి. మోడీ ప్రభుత్వ హయాంలో భారత విదేశీ విధానం మరింత దృఢంగా, శక్తిమంతంగా తయారైందని యింగ్ తెలిపారు.
డొక్లాం రెండు దేశాలపై ప్రభావం
ప్రస్తుత పరిస్థితుల్లో శక్తిమంత దేశంగా తయారయ్యేందుకు ఇదో వ్యూహం అని ఆయన పేర్కొన్నరు. మోడీ హయాంలో చైనా, భారత్ మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా డోక్లాం వివాదాన్ని ప్రస్తావించారు. దీనివల్ల సరిహద్దు వివాదం ఏర్పడటంతో పాటు, రెండు దేశాల సంబంధాలపైనా ప్రభావం చూపించిందన్నారు.
భారత అభివృద్ధికి చైనా అడ్డంకి కాదు
పరస్పర అభివృద్ధి కోసం రెండు దేశాలు వ్యూహాత్మకంగా ఏకాభిప్రాయానికి రావాలని ఆయన సూచించారు. భవిష్యత్లో రెండు దేశాలు భాగస్వాములుగాను, పోటీదారులుగాను ఉంటాయన్నారు. భారత అభివృద్ధిలో చైనా ఎప్పటికీ అడ్డంకి కాదని, అదో అవకాశమన్నారు. చైనా విషయానికొస్తే భారత్ ప్రధాన పొరుగు దేశమని, అంతర్జాతీయంగా సంస్కరణలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన భాగస్వామి అన్నారు.
మోడీ ప్రాధాన్యం
ఎన్నికల అనంతరం ప్రమాణ స్వీకారానికి దక్షిణ ఆసియా దేశాల నేతలను ఆహ్వానించడం, భూటాన్ వంటి చిన్న దేశాల్లో పర్యటించడం బట్టి పొరుగు దేశాలతో సత్సంబంధాలకు మోడీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోందని ఆయన చెప్పారు.
వారితో పోలీస్తే మోడీ దౌత్యం ఫలిస్తోంది
గత ప్రభుత్వ అధినేతలతో పోలిస్తే దక్షిణాసియా దేశాల్లో మోడీ దౌత్యం ప్రతిఫలిస్తోందని ఆయన చెప్పారు. అయితే, పొరుగు దేశాలకు సాయం పేరిట ఆయా దేశాలను చెప్పుచేతుల్లోకి తీసుకుంటోందని మాత్రం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక పాకిస్థాన్ విషయంలో దాడులు జరిపేందుకు సరిహద్దులను దాటేందుకు సైతం భారత్ వెనుకాడడం లేదంటూ సర్జికల్ దాడులను ఉటంకించారు.
పాకిస్తాన్ విషయమై హెచ్చరిక
మోడీ ప్రభుత్వ హయాంలో దూకుడుగా సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కూడా పెరిగిందని ఆయన చెప్పారు. అయితే, పాకిస్థాన్ విషయంలో భారత వైఖరి వల్ల భవిష్యత్తులో కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.