దేశంలో 2లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు: భారీగా పెరిగిన రికవరీలు, 2.8 కోట్లకు పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 50 రోజుల్లో తాజాగా అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా రెండు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు ఉండటం గమనార్హం. కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. మరణాలు మాత్రం స్వల్పంగానే తగ్గుతున్నాయి.
దేశంలో కొత్తగా 1,52,734 కరోనా కేసులు, 3128 మరణాలు
సోమవారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఆదివారం 16,88,135 నమూనాలను పరీక్షించగా.. 1,52,734 మందికి కరోనా సోకినట్లు తేలింది. అయితే, నిన్న కరోనా పరీక్షలు కూడా తగ్గడం గమనార్హం. ఇక గత 24 గంటల్లో 3128 కరోనా మరణాలు సంభవించాయి. వరుసగా ఐదో రోజు కూడా నాలుగువేలకు దిగువనే మరణాలున్నాయి. ఇప్పటి వరకు 2.8 కోట్ల మంది కరోనా బారినపడగా, 3,29,100 మంది కరోనాతో మరణించారు.
దేశంలో భారీగా పెరిగిన కరోనా రికవరీలు
గత 24 గంటల్లో 2,38,022 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2.56 కోట్లకుపైబడింది.
దేశంలో పాజిటివిటీ రేటు 7.58 శాతానికి తగ్గింది. మరోవైపు రికవరీ రేటు 91.25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి. ఇది ఇలావుండగా, ఆదివారం 10,18,076 మంది కరోనా వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 21,31,54,129కి చేరింది. కాగా, జూన్ నెలలో దాదాపు 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో వ్యాక్సిన్ కొరత తీరనుంది.
దేశంలో 2.8 కోట్లకు కరోనా పాజిటివ్ కేసులు, అమెరికా తర్వాత భారత్
ప్రస్తుతం దేశంలో 2.8 కోట్ల కరోనా పాజిటివ్ కేసులున్నాయి. దీంతో 3.32 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండటంతో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 34.48 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల మంది కరోనా బారినపడగా, 35 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు.
Recommended Video