లండన్లోని అంబేడ్కర్ ఇంటిని కొంటున్న భారత్
లండన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన విద్యార్థి రోజుల్లో లండన్లో నివసించిన భవనాన్ని భారత ప్రభుత్వం 40 లక్షల పౌండ్లకు కొనుగోలు చేయనుంది. ఉత్తర లండన్లోని కింగ్ హెన్రీస్ రోడ్డులో ఉన్న ఈ భవనం కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.
1921-22 సంవత్సరాల మధ్య అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతున్న సమయంలో ఈ భవనంలో నివసించినట్లు ఆ భవనంపై ఉన్న నీలి రంగు ఫలకంపై ఉంది. ఈ భవనం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఈ ఆస్తిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఈ వ్యవహారం చూస్తున్న భారత హైకమిషన్లోని దౌత్య అధికారి ఒకరు చెప్పారు.
ఇదొక చారిత్రక చిహ్నమని, ఎందుకంటే ఇది ఓ భవనం మాత్రమే కాదు, భారతీయులందరి మనోభావాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయని గత ఏప్రిల్లో లండన్ సందర్శించిన మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్కుమార్ బడోలె చెప్పారు.

ఈ భవనం ఖరీదు 32 లక్షల నుంచి 40 లక్షల పౌండ్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లండన్లోని ప్రైమ్ లొకాలిటీలో 2050 చదరపు అడుగుల స్థలంలో మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనం గత ఏడాది ఒక ఎస్టేట్ ఏజంట్ ద్వారా అమ్మకానికి వచ్చింది.
ఈ భవనాన్ని కొనుగోలు చేయాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో పాటుగా మహారాష్ట్ర మంత్రివర్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విద్యార్థిగా ఉన్నప్పుడు లండన్ ఉత్తర ప్రాంతంలోని కింగ్ హెన్రీ రోడ్డులో బస చేసిన ఇల్లు ఇది. ప్రస్తుతం ఈ ఇంటిని కొనుగోలు చేసి స్మారక భవనంగా తీర్చిదిద్దడంతో పాటు భారత విద్యార్థులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications