మే నుంచే డ్రాగన్ కుట్రలు: భారత్ ఆగ్రహం, తీవ్రంగానే పరిగణిస్తామంటూ చైనాకు హెచ్చరిక
న్యూఢిల్లీ: సరిహద్దులోని గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో చైనా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా దళాల మోహరింపు, దుందుడుకు తీరు జూన్ 6న చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని స్పష్టం చేసింది. గల్వాన్ లోయలో సైనిక బలగాల మొహరింపు, నిర్మాణాలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్య అంశమని విదేశాంగ శాఖ తేల్చింది.
చైనా ఎప్పుడూ కట్టుబడి లేడు..
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని, మార్పులు చేయకూడదని రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని చైనా ఎప్పుడూ లక్ష్యపెట్టలేదని మండిపడింది. చైనా దురాక్రమణకు పాల్పడేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులు తీవ్రంగానే పరిగణిస్తామని హెచ్చరించింది.
మే నుంచే చైనా నిబంధనలకు విరుద్ధంగా..
గతంలో సందర్భాన్ని బట్టి వెనక్కి తగ్గినప్పటికీ ఇటీవల మాత్రం చైనా బలగాల ప్రవర్తన పరస్పరం చేసుకున్న అంగీకర ఒప్పందాలకు పూర్తి విరుద్ధంగా ఉందంటూ భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. మే నెల ఆరంభం నుంచీ ఇలాగే జరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారీ స్థాయిలో బలగాలు, యుద్ధ సామాగ్రిని మోహరించడం మొదలుపెట్టింది. గతంలో జరిగిన ద్వైపాక్షిక అంగీకారానికి ఇది పూర్తి విరుద్ధమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రత్యేకించి భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లోని వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సామరస్యంగా ఉండాలన్న 1993 ఒప్పందానికి వ్యతిరేకమని పేర్కొంది. అప్పటి ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖ వద్ద తమ ఆధీనంలోని భూభాగంలో ప్రతివైపు పరిమిత స్థాయిలో, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడేలా సైనిక బలగాలు ఉండాలని తెలిపింది.
కయ్యానికి కాలు దువ్వి..
లడఖ్ సమీపంలోని గల్వాల్ లోయలో జూన్ 15న భారత్-చైనా సైనికులు ఘర్షణ పడిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులు కాగా, మరో 70 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలో తమ కమాండర్ ఒకరు మృతి చెందారని చైనా ప్రకటించింది. అయితే, మొత్తం ఎంతమంది చనిపోయారనే విషయాన్ని వెల్లడించలేదు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం 40 మందికిపైగానే చైనా సైనికులు హతమయ్యారని తెలుస్తోంది.
Recommended Video
భారత్ శాంతి కోసం ప్రయత్నిస్తుంటే..
ఈ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా దౌత్య చర్చలు జరుపుతున్నాయి. భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు శాంతి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకవైపు చర్చలు జరుపుతున్న సమయంలోనే చైనా సరిహద్దులో భారీగా బలగాలను మోహరిస్తోంది. అంతేగాక, ఇటీవల ఘర్షణలో భారత దళాలదే తప్పంటూ జిత్తులమారి వేషాలు వేస్తోంది. ఈ క్రమంలో భారత్ చైనా వ్యవహరంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ శాంతి ప్రయత్నాలు చేస్తుంటే.. చైనా మాత్రం దురాక్రమణకు కుట్రలు చేస్తోందంటూ మండిపడింది. చైనాకు తగిన రీతిలో బుద్ధి చెప్పకతప్పదని అభిప్రాయపడింది.