ఐరాసకు భారత్ అరుదైన గిఫ్ట్- శాంతి దళాలకు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు
కరోనా మహమ్మారిపై అంతర్జాతీయంగా జరుగుతున్న పోరులో భారత్ ఛాంపియన్గా నిలుస్తోంది. ఇప్పటికే భారత్లో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఓవైపు స్వదేశంలో ప్రజలకు పంపిణీ చేస్తూనే మరోవైపు భారత ఉపఖండంలోని దేశాలకు సైతం పంపుతోంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఐక్యరాజ్యసమితికి కూడా వీటిని బహుమతిగా ఇవ్వాలని భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఐక్యరాజ్యసమితి తరఫున పలు దేశాల్లో శాంతిని నెలకొల్పేందుకు పనిచేస్తున్న బలగాలకు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్ చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. నిన్న ఐరాస భద్రతామండలిలో నిర్వహించిన ఓపెన్ డిబేట్లో పాల్గొన్న విదేశాంగమంత్రి జైశంకర్ ఈ ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నా ప్రపంచానికి సాధ్యమైనంత సహకరించాలన్న గతేడాది తీర్మానం మేరకు ఈ సాయం చేయదల్చుకున్నట్లు జైశంకర్ వెల్లడించారు.
భారత్ ఇప్పటికే వ్యాక్సిన్ మైత్రీ కార్యక్రమం కింద 25 దేశాలకు వ్యాక్సిన్ అందిస్తోందని, ఇప్పుడు పలు దేశాల్లో క్లిష్టమైన పరిస్ధితుల్లో పనిచేస్తన్న శాంతిదళాలకు సైతం 2 లక్షల డోసులు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు విదేశాంగమంత్రి జైశంకర్ తెలిపారు. త్వరలో మరో 49 దేశాలకు సైతం తాము వ్యాక్సిన్ అందిస్తామని జై శంకర్ సగర్వంగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 వరకూ భారత్ తాము బహుమతిగా ఇవ్వదల్చుకున్న 167.7 లక్షల వ్యాక్సిన్లలో 62.7 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు జై శంకర్ తెలిపారు.