సరిహద్దులో టెన్షన్:యుద్ధ డ్రోన్లతో చైనా.. దీటుగా స్పందించిన భారత్.. అసలేం జరుగుతోందంటే..
కరోనా విలయానికి కారణమైన చైనా.. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి ఎదురయ్యేసరికి ఇంకాస్త పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. సరిహద్దులో యుద్ధ విన్యాసాలు చేస్తూ భారత్ ను రెచ్చగొట్టేప్రయత్నం చేస్తున్నది. లదాక్ లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా బలగాలను మోహరింపజేసిన డ్రాగన్ దేశం.. మంగళవారం మరో అడుగు ముందుకేసి, యుద్ధ డ్రోన్లను సైతం రంగంలోకి దింపింది. భారత బలగాలు చేపట్టిన ప్రతి పనికి అడ్డుతగులుతూ కవ్వింపుచర్యలకు దిగుతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసేలా మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

రక్షణ మంత్రి కీలక భేటీ..
బంగ్లాదేశ్(4,096 కిలోమీటర్లు) తర్వాత భారత్ చైనాతో (3,488 కిలోమీటర్లు) సుదీర్ఘ సరిహద్దును పంచుకోవడం తెలిసిందే. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్ ఆధీనంలోని పాంగాంగ్, గాల్వాన్ ప్రాంతాల్లో నెలకొన్ని పరిస్థితులు, భద్రతా వ్యవహారాలపై ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. గంటకుపైగా సాగిన భేటీలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.

వెనక్కి తగ్గేదే లేదు..
పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే.. రాజ్ నాథ్ కు వివరించగా.. భారత్ తన భూభాగాన్ని కాపాడుకోవడంలో వెనుకడుగువేసే ప్రసక్తేలేదని, చైనా ఎంతమందైతే సైన్యాలను దింపిందో, దానికి సరిసమానంగా మనమూ బలగాలను మోహరింపజేయాలని మంత్రి సూచించారు. ఉద్రిక్తతలు తగ్గేందుకు మన వంతు ప్రయత్నం చేస్తూనే, రోడ్డు నిర్మాణం, ఇతర ఇన్ఫ్రాస్ట్రకచర్ పనులు యధావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. 2017లో డోక్లాం తరహాలోనే ఇప్పుడు లదాక్ లోనూ చైనా చిచ్చుపెట్టాలని చూస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చర్చలకు మోకాలడ్డు..
సరిహద్దులో పరిస్థితులు మరింతగా దిగజారకుండా, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ చైనా ప్రతిసారి మోకాలడ్డుతోంది. తూర్పు లదాక్ లోని వాస్తవాధీన రేఖ వద్ద మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఇండియన్ ఆర్మీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య కమాండర్ల స్థాయిలో ఇప్పటికే ఆరు సార్లు చర్చలు జరిగాయి. మన భూభాగంలో నిర్మిస్తోన్న రోడ్లు, మౌలిక వసతుల నిర్మాణాన్ని ఆపేయించేందుకు చైనా పలు రకాలుగా ప్రయత్నిస్తున్నది.

చైనా తీరుతో కలవరపాటు..
సరిహద్దుల్లో చైనా అప్పుడప్పుడూ రెచ్చిపోవడం సహజమే అయినప్పటికీ ఈసారి దాని తీరు మరింత ప్రమాదకరంగా, కలవరపాటుకు గురిచేసేలా ఉందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈనెల 5న పాంగాంగ్ ప్రాంతంలో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగడం, రక్తాలొచ్చేలా కొట్టుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే సిక్కిం సరిహద్దులోనూ అలాంటి ఘర్షణ వాతావరణమే తలెత్తింది. పాంగాంగ్ సమీపంలోని గాల్వాన్ లోయలో.. గడిచిన రెండు వారాల్లో చైనా వందకుపైగా తాత్కాలిక గుడారాలను నిర్మించి, సైన్యాన్ని మోహరించింది. వాళ్లకు సమానమైన సంఖ్యలో మనమూ బలగాలను మోహరింపజేయాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.
Recommended Video

డ్రాగన్ దూకుడు వెనుక భారీ కుట్ర..
కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాను కార్నర్ చేశాయి. వూహాన్ ల్యాబ్ లో తనిఖీలు చేపట్టేందుకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా చేసిన ప్రయత్నాలకు భారత్ మద్దతు పలికింది. అదీగాక, కరోనా అనంతర కాలంలో పదుల కొద్దీ కంపెనీలు తమ కార్యాలయాలను చైనా నుంచి భారత్ కు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ దశలో భారత్ ను అస్థిరపర్చడమే టార్గెట్ గా చైనా పావులు కదుపుతున్నది. ఎన్నడూ లేనిది నేపాల్ తో యుద్ధ భాష మాట్లాడించడం, భారత్ భూభాగాన్ని తమదిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేయడం వెనుకా చైనా హస్తం ఉందనేది కాదనలేని సత్యం. లడాక్ లో పోరును క్రమంగా పెద్దది చేస్తూ.. సుదీర్ఘకాలంపాటు ఇండియాను ఇబ్బంది పెట్టాలని చైనా కంకణం కట్టుకున్నట్లు డిఫెన్స్ నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications