Arshdeep Singh: టీమిండియాలో ఖలిస్తానీ..!!
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కొనసాగుతోన్న ఆసియా కప్ 2022 సూపర్ 4లో భారత క్రికెట్ జట్టు పరాజయాన్ని చవి చూసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ టోర్నమెంట్లో ఇదే తొలి ఓటమి. గ్రూప్ దశలో పాకిస్తాన్, హాంకాంగ్పై తిరుగులేని విజయాలను సాధించిన టీమిండియా- సూపర్ 4 రెండో మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయింది.
భారీ స్కోర్ సాధించినా..
టాస్ ఓడిపోయి- తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లల్లో 181 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. శుభారంభం చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 54 పరుగులు జోడించారు. ఓవర్కు తొమ్మిదికి పైగా రన్రేట్తో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టించారు. ఒక దశలో 200కు పైగా పరుగులు సాధిస్తారని భావించినప్పటికీ.. మిడిల్ ఓవర్లల్లో పాకిస్తాన్ బౌలర్లు రిథమ్ అందుకున్నారు. వరుసగా వికెట్లు పడగొట్టారు.
హాఫ్ సెంచరీతో..
టీమిండియా బ్యాటింగ్ బ్యాక్బోన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ టోర్నమెంట్లో వరుసగా ఇది రెండో హాఫ్ సెంచరీ. అంతకుముందు గ్రూప్ దశలో హాంకాంగ్పై అర్ధసెంచరీ చేశాడు. మొన్నటివరకు ఫామ్ కోల్పోయి విమర్శలకు గురైన కింగ్ కోహ్లీ- ఎట్టకేలకు విజృంభించాడు. 44 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్తో 60 పరుగులు చేసి- చివర్లో రనౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ- 28, కేఎల్ రాహుల్-28, సూర్యకుమార్ యాదవ్-13, రిషభ్ పంత్-14, దీపక్ హుడా-16 పరుగులు చేశారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా డకౌట్గా వెనుదిరిగాడు.
లక్ష్యాన్ని ఛేదించి..
అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్- 19.5 ఓవర్లల్లో 182 పరుగులు చేసింది. ఈ క్రమంలో అయిదు వికెట్లు కోల్పోయింది. కేప్టెన్ కమ్ ఓపెనర్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్లో కూడా విఫలం అయ్యాడు. 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్ బ్యాటర్ ఫకర్ జమాన్-15, ఆసిఫ్ అలీ-16 పరుగులు చేశారు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, టాప్ ఆర్డర్ బ్యాటర్ మహ్మద్ నవాజ్ భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. రిజ్వాన్-71, నవాజ్-42 పరుగులు చేశారు.
కీలక దశలో క్యాచ్ డ్రాప్..
డెత్ ఓవర్లల్లో విజృంభించి ఆడుతోన్న ఆసిఫ్ అలీ క్యాచ్ డ్రాప్..టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది. పాకిస్తాన్ చివరి 15 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో క్యాచ్ డ్రాప్ చేశాడు అర్ష్దీప్ సింగ్. రవి బిష్ణోయ్ బౌలింగ్లో అవుట్ సైడ్ హాఫ్గా వెలువడిన బంతిని స్లాంగ్ స్వీప్ షాట్ ఆడబోయాడు ఆసిఫ్ అలీ. టైమింగ్ మిస్ అయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి ఎగిరింది. లడ్డూ లాంటి క్యాచ్ అది. చెమట పట్టకుండా పట్టగలిగే క్యాచ్. అక్కడే ఉన్న అర్ష్దీప్ సింగ్ దాన్ని అందుకోలేకపోయాడు.
విజృంభించిన ఆసిఫ్ అలీ..
క్యాచ్ డ్రాప్ తరువాత ఆసిఫ్ అలీ చెలరేగాడు. 8 బంతుల్లో రెండు సిక్సర్లు ఒక ఫోర్ బాదాడు. రిక్వైర్డ్ రన్రేట్ బాగా తగ్గింది. చివరి ఓవర్ నాలుగో బంతికి అతను అవుట్ అయినప్పటికీ.. అప్పటికే పాకిస్తాన్ విజయానికి చేరువైంది. ఈ క్యాచ్ డ్రాప్.. అర్ష్దీప్ సింగ్ను విమర్శలకు గురి చేసింది. అతణ్ని ఖలిస్తానీగా అభివర్ణిస్తోన్నారు నెటిజన్లు. #khalistani అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి. అతనికి మద్దతుగానూ పోస్టింగ్స్ పెడుతున్నారు మరికొందరు నెటిజన్లు. #IstandWithArshdeep అంటూ పోస్టింగులు చేస్తోన్నారు.