చైనాకు నిద్ర లేకుండా చేసిన భారత ఆర్మీ: ఫింగర్ 4 ఆధీనంలో ఉన్నా ఏంచేయలేని డ్రాగన్
న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బలగాలకు ఎప్పటికప్పుడు గట్టి సమాధానమే చెబుతోంది భారత సైన్యం. మూడ్రోజుల క్రితం మన సరిహద్దులోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాలను ధీటుగా ఎదురించి సరిహద్దుల నుంచి తరిమికొట్టారు భారత సైనికులు. ఈ ఘర్షణలో ఓ భారత ఆర్మీ అధికారి అమరుడవగా.. ఇద్దరు చైనా సైనికులు హతమయ్యారు.
Recommended Video
ఫింగర్ 4 చైనా ఆధీనంలో ఉన్నా..
కాగా, భారత సైన్యం సరిహద్దులో ఎంతో కీలకమైన ప్యాంగ్యాంగ్ త్సోకు ఉత్తర, దక్షిణ ప్రాంతాలపై ఆధిపత్యం సాధించింది. కానీ, మరో కీలక ప్రాంతమైన ఫింగర్ 4 చైనా సైనికుల ఆధీనంలో ఉంది. అయినా, ఫింగర్ 4 ప్రాంతంలో ఉన్న చైనా బలగాలు ఏం చేస్తున్నాయో.. భారత సైనికులు అంతకన్నా ఎత్తైనా ప్రాంతాలైన ప్యాంగ్యాంగ్ త్సో ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆందోళన చెందుతోంది.
చైనాకు అదే భయం పట్టుకుంది..
ఇప్పుడు చైనాకు ఫింగర్ 4ను కూడా భారత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటుందేమోననే ఆందోళన పట్టుకుంది. దీంతోనే ఫింగర్ 4 ప్రాంతంలో భారీగా చైనా బలగాలను మోహరించింది. ప్యాంగ్యాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న ప్రాంతం భారత బలగాలకు ఎంతో కీలకమైనది. చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడదామనుకున్నా.. మన జవాన్లకు ముందే తెలిసిపోతుంది.
భారత సైన్యం దూకుడుతో.. చైనా నిరసన
భారత ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఎత్తైన ప్రాంతాలతో చైనా ఆధీనంలో ఉన్న మోల్డో గారిసన్, స్పంగుర్ గ్యాప్పై కూడా మన సైన్యానికి ఆధిపత్యం ఏర్పడింది.అంతేగాక, ఫింగర్ 4 సమీపంలోని పలు ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు భారత ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. అత్యంత క్లిష్టమైన ఎత్తైన ప్రాంతం రిచిన్ లాకు కూడా భారత సైన్యం చేరుకోవడంపై చైనా బలగాలు నిరసన తెలుపుతున్నాయి.
చైనాకు నిద్రలేకుండా చేసిన భారత సైన్యం..
ఫింగర్ 4 ప్రాంతంలో చైనా బలగాలు ఏం చేస్తున్నాయి, బలగాలను పెంచుతోందా? ఏదైనా కవ్వింపు చర్యలకు దిగేందుకు ప్రయత్నిస్తుందా? అనే విషయాలను భారత సైన్యం తమ ఆధీనంలోని ఎత్తైన ప్రాంతాల నుంచి నిశితంగా గమనించవచ్చు. దీంతో చైనా మన జవాన్లపై ఎలాంటి దాడి చేసేందుకు నిర్ణయించుకున్నా.. భారత జవాన్లు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు ముందే సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని, చైనా ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నాయి.