చైనాకు షాక్... ఆ పర్వతాలపై భారత సైన్యం మకాం... ఇక డ్రాగన్ ఆటలు సాగవు...
జూన్ 15 హింసాత్మక ఘటన తర్వాత భారత్-చైనా మధ్య తారాస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు చర్చలతో సమసిపోతాయని భావించినప్పటికీ... ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు. పైగా గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దులో కాల్పులు చోటు చేసుకోవడం యుద్ద ఊహాగానాలకు తెరలేపింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పిన చైనా... అందుకు విరుద్దంగా మరిన్ని బలగాలను మోహరిస్తుండటం,పర్వత ప్రాంతాల పైనుంచి కాల్పులకు తెగబడుతుండటం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా డ్రాగన్కు గట్టిగా బుద్ది చెప్పేలా అడుగులు వేస్తోంది.
Recommended Video

ఆ పర్వతాలపై భారత బలగాలు...
తాజాగా పాంగాంగ్ త్సో సరస్సు వెంబడి ఫింగర్ 4 పాయింట్ వద్ద ఉన్న పర్వతాల పైకి భారత బలగాలు చేరుకున్నాయి. ఇక్కడినుంచి చూస్తే చైనా ఆర్మీ స్థావరాలు స్పష్టంగా కనిపిస్తాయి. నిజానికి ఫింగర్ 4 వద్ద ఉన్న పర్వతాలను చైనీస్ ఆర్మీ ఇప్పటికే ఆక్రమించింది. అయితే గ్రీన్ టాప్ సహా ఇప్పుడు భారత్ ఆక్రమించిన పర్వతాలు వాటికంటే ఎత్తులో ఉన్నవి. ఇక్కడినుంచి నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు చైనా కదలికలను గమనించవచ్చు. కాబట్టి ఇంతకుముందులా భారత్పై విరుచుకుపడటం అంత సులువేమీ కాదు. ఒకరకంగా భారత్ తాజా చర్యతో చైనా ఆటలు ఇక సాగవనే చెప్పాలి.

మరోవైపు చర్చలు...
మరోవైపు సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య గురువారం(సెప్టెంబర్ 10) బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో మిలటరీ చర్చలు జరిగాయి. సరిహద్దులో ఎటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ.... ఇరువురి మధ్య సమాచార సంబంధాలు(కమ్యూనికేషన్ లైన్స్) ఎప్పుడూ కొనసాగాలన్న ఉద్దేశంతో ఈ చర్చలు జరిపారు.'భారత్-చైనా మధ్య ఇవాళ బ్రిగేడ్ కమాండర్,కమాండింగ్ ఆఫీసర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇరువైపులా కమ్యూనికేషన్ లైన్స్ను అందుబాటులో ఉంచడమే చర్చల ముఖ్య ఉద్దేశం.' అని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్-మే సమయంలోనే చైనా బలగాలు
నిజానికి ఏప్రిల్-మే సమయంలోనే చైనా బలగాలు ఫింగర్ 4 పర్వతాలపై మకాం వేశాయి. జూన్ 15 హింసాత్మక ఘటన తర్వాత జరిగిన చర్చల్లో రెండు దేశాలు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ... చైనా దానికి కట్టుబడలేదు. ఫలితంగా ఇప్పటికీ భారత్-చైనా సరిహద్దు యుద్ద వాతావరణాన్నే తలపిస్తోంది. ఇటీవల వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు డ్రాగన్ విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి చైనాను వెనక్కి తరిమికొట్టారు. ఈ క్రమంలో చైనా గాల్లోకి కాల్పులు కూడా జరిపింది. అయితే భారతే కాల్పులు జరిపిందని మరో నింద మోపే ప్రయత్నం చేసింది. ఏదేమైనా నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో జరిగిన ఈ కాల్పులు యుద్ద సంకేతాలా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications