యూట్యూబ్ హెడ్ 'వెంకట్'ను గౌరవించనున్న ఇండియన్ క్యాన్సర్ సొసైటీ
బెంగుళూరు: ఇండియన్ క్యాన్సర్ సొసైటీ జూన్ 5న బెంగుళూరులోని చౌడయ్య మెమోరియల్ హాల్లో 'బీట్ క్యాన్సర్ మ్యూజికల్ నైట్' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇటీవల కాలంలో ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డారో వారికి క్యాన్సర్ను జయించిన వారి జీవితాలను స్పూర్తిగా తెలియజేస్తారు.
ప్రతి ఏడాది జూన్ నెల మొదటి వారంలో వచ్చే ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ క్యాన్సర్ సర్వైవర్స్ డేని నిర్వహిస్తుంటారు. జీవితాన్ని జరుపుకునే రోజుగా భావిస్తారు. క్యాన్సర్ బారిన పడిన రోగులను ఆదుకునేందుకు, నిరుపేదలకు సాయం చేసేందుకు గాను నిధులు సేకరించడానికి ఇండియన్ క్యాన్సర్ సొసైటీ కర్ణాటకలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
క్యాన్సర్ పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించడం, సాయం చేయడానికి తన సంసిద్ధతను తెలియజేసిన గూగుల్ యూట్యూబ్ హెడ్, యాహూ మాజీ సీఈఓ వెంకట్ పంచపకేశనిన్ను ఈ కార్యక్రమంలో గౌరవించనున్నారు. ఇటీవలే వెంకట్ GI క్యాన్సర్ను అధిగమించారు.
క్యాన్సర్కు వ్యతిరేకంగా మన దేశంలో పోరాడే విధంగా వెంకట్తో పాటు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ఛైర్మన్ కిశోర్ రావు మాట్లాడుతూ గుండె, రక్తనాళాల జబ్బు తర్వాత మన దేశంలో ఎక్కువ మంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారన్నారు.
క్యాన్సర్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇప్పటికే దేశంలో పలు చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా క్యాన్సర్ బారి నుంచి ప్రజలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ మ్యూజికల్ నైట్లో ప్రముఖ సంగీతకారులు శివమణి, రాహుల్ శర్మ, స్టీఫెన్ దేవస్సీ, యు రాజేష్, గిరిధర్ ఊతప్ప, భరద్వాజ్ సత్తవల్లి, సత్యజిత్ తల్వాకర్లు తదితరులు ఆటపాటలతో అలరించనున్నారు.