భారత్పై చైనా బరితెగింపు: జవాన్ల మధ్య ఘర్షణ..తోపులాట: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత: కరోనా తగ్గగానే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో చావును సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన చైనా.. తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసేలా.. అగ్రరాజ్యాలను సైతం కుదేల్ చేసేలా.. లక్షలాది మంది ప్రాణాలు గాలిలో దీపంలా మారడానికి కారణమైన చైనా ఏమాత్రం పశ్చాత్తాపం పడేలా కనిపించట్లేదు. తన వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని మరోసారి స్పష్టం చేసింది. కరోనాకు ముందు ఎలా ఉందో.. తరువాత కూడా అలాగే కనిపిస్తోంది. పొరుగునే ఉన్న భారత్పై మరోసారి తన బరితెగింపు వైఖరిని ప్రదర్శించింది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.
Recommended Video
కల్పితమేనా..? మర్కజ్ చీఫ్ వివాదాస్పద ఆడియో టేపు.. వెలుగులోకి సంచలన విషయాలు..
సిక్కిం సరిహద్దుల్లో ఘర్షణ..
భారత్, చైనా జవాన్ల మధ్య సరిహద్దుల్లో ఘర్షణ చోటు చేసుకుంది. రెండు దేశాల జవాన్లు ఒకరినొకరు ఘర్షణ పడ్డారు. తోసుకున్నారు. తోపులాటకు దిగారు. ఈ ఘటనలో ఈ రెండు దేశాల జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం ఉత్తర ప్రాంతంలోని నకు లా సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని మనదేశ ఆర్మీ అధికారులు ధృవీకరించారు. సరిహద్దు గొడవలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాల్సి ఉన్నప్పటికీ.. చైనా తన వైఖరిని మార్చు కోలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
5000 మీటర్ల ఎత్తులో..
సముద్ర ఉపరితలం నుంచి సుమారు అయిదు వేల మీటర్ల ఎత్తులో ఉంటుండీ నకు లా సెక్టార్. రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించడానికి రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతం. ఇదివరకు సిక్కిం సరిహద్దుల్లోనే ఉన్న డోక్లామ్ జంక్షన్ విషయంలో భారత్, చైనా జవాన్ల మధ్య తరచూ ఘర్షణ పూరక వాతావరణం నెలకొంటూ ఉండేది. డోక్లామ్ ట్రై జంక్షన్ వద్ద పలుమార్లు రెండు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. అదే తరహా ఉద్రిక్త వాతావరణం ఈ సారి నకు లా సెక్టార్లో చోటు చేసుకుంది.
150 మంది జవాన్ల మధ్య..
నకులా సెక్టార్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘర్షణ సమయంలో 150 మంది జవాన్లు సంఘటనా స్థలంలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచిందని, ఒకరినొకరు మాటల ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని అంటున్నారు. ఇది కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారిందని, బాహాబాహికి దిగడానికి కారణమైందని సమాచారం. ఈ ఘర్షణలో రెండు దేశాలకు చెందిన పదుల సంఖ్యలో జవాన్లకు స్వల్పంగా గాయలైనట్లు భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
సరిహద్దు ప్రాంతంపై పట్టు సాధించడానికి
భారత భూభాగంపై పట్టు సాధించడానికి చైనా జవాన్లు ఉద్దేశపూరకంగా ఈ ఘర్షణకు దిగారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నకు లా సెక్టార్లో భారత భూభాగంపైకి చొచ్చుకొచ్చిన చైనా అధికారులు తమ దేశపు జెండాను నాటడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు. దీన్ని అడ్డుకోవడంతో పాటు వారిని వెనక్కి వెళ్లేలా చేయడంలో భారత జవాన్లు విజయవంతం అయ్యారని సమాచారం. అనంతరం రెండు దేశాల సెక్టార్ స్థాయి అధికారుల మధ్య సంప్రదింపులు జరిగాయని అంటున్నారు. సరిహద్దు గొడవలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి ఉండగా..చైనా ఇలా దూకుడుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమౌతున్నాయి.