భారత్ నుంచి మూడు వ్యాక్సిన్లు ట్రయల్స్ చివరి దశలో: రష్యా ‘స్పుత్నిక్ వీ’ కూడా మనదేశంలోనే
న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రష్యాతోపాటు భారత్, యూకే, అమెరికా లాంటి దేశాలు కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు కసరత్తులు వేగవంతం చేస్తున్నాయి. కాగా, మూడు వ్యాక్సిన్ అభ్యర్థులు అడ్వాన్స్డ్ స్టేజ్కు చేరుకున్నాయని మంగళవారం ఐసీఎంఆర్ ప్రకటించింది.
భారత్ నుంచి ప్రధానంగా మూడు వ్యాక్సిన్లు..
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ రేసులు భారత్ ముందుందని తెలిపారు. రెండు ఇండిజీనియస్ వ్యాక్సిన్లతోపాటు మొత్తం మూడు కరోనా వ్యాక్సిన్ అభ్యర్థులు వివిధ దశల్లో అభివృద్ధిలో ఉన్నాయని తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ను భారత సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తుండగా, భారత్ బయోటెక్.. కోవాక్సిన్, జైడస్ కొడిలా.. జైకోవ్-డీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. ఈ మూడు కూడా సమర్థవంతమైన వ్యాక్సిన్లని తెలిపారు. ఈ మూడు వ్యాక్సిన్లు కూడా వివిధ దశల్లో ఉన్నాయని డాక్టర్ భార్గవ తెలిపారు.
ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్న మూడు వ్యాక్సిన్లు..
సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేస్-2(బీ) దశలో ఉండగా, ఫేస్ 3 ట్రయల్స్ తొలి విభాగంలో 1700 మందిని పరీక్షించింది. ఇక భారత్ బయోటెక్ ఫేస్ 2 దశను ప్రారంభింస్తుండగా, జైడస్ కొడిలా వ్యాక్సిన్ ఫేస్ 2 ను పూర్తి చేసింది. ఇప్పటికే 50 మందిని పరీక్షించింది. వ్యాక్సిన్ల క్లినికల్ అభివృద్ధి అనేది మూడు దశల ప్రక్రియ. మొదటి దశలో, చిన్న సమూహాల ప్రజలు ట్రయల్ వ్యాక్సిన్ను స్వీకరిస్తారు. రెండవ దశలో, క్లినికల్ అధ్యయనం విస్తరించబడింది, కొత్త టీకా ఉద్దేశించిన వారి మాదిరిగానే లక్షణాలు (వయస్సు, శారీరక ఆరోగ్యం వంటివి) ఉన్నవారికి టీకా ఇవ్వబడుతుంది. ఇక మూడవ దశలో, టీకా వేలాది మందికి ఇవ్వబడుతుంది, సమర్థత మరియు భద్రత కోసం పరీక్షించబడుతుంది. భారతదేశంలో ఇప్పటి వరకు కనీసం 1750 మందిని పరీక్షించడం జరిగింది. కోవాక్సిన్ ఫేస్ 2, జైడస్ కూడా ట్రయల్స్ కూడా ఊపందుకుంటే ఆ సంఖ్య మరింతగా పెరిగిపోయింది.
తొలి వ్యాక్సిన్ రష్యా నుంచే..
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, రష్యా అభివృద్ధి చేసిన స్ఫుత్నిక్ వీ వ్యాక్సినే ఇప్పుడు ప్రధానంగా అన్ని వ్యాక్యిన్ల కంటే మెరుగైందిగా చెప్పుకుంటోంది. అయితే, అన్ని పరీక్షల దశలను పూర్తి చేసుకోకుండానే ఈ వ్యాక్సిన్ను మాస్కో ఆమోదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. రష్యా వ్యాప్తంగా 45 మెడికల్ కేంద్రాల్లోని 40వేల మందిపై ట్రయల్స్ జరిపారు. ఇప్పుడు ఫేస్-3 ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంటోంది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కోసం రష్యాతో సంప్రదింపులు
కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను భారత్కు తీసుకొచ్చేందుకు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇటీవల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై రష్యా-భారత్లు చర్చించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు. అయితే, రష్యా కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది. రష్యన్ డైరెకట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రివ్ ఈమేరకు వెల్లడించారు. లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాలు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. భారత భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భారత్ తోపాటు యూఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత్ తోపాటు మరో ఐదు దేశాల్లో ఉత్పత్తి చేస్తామని చెప్పిన ఆయన.. ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీ, ఇతర దేశాల్లో తమ వ్యాక్సిన్కు అత్యధిక డిమాండ్ ఉందని తెలిపారు.