దేశీ ఐటీపై భరోసా కష్టమే?, కళ చెదిరింది: విదేశీ మీడియా ఆసక్తికరం..
2020నాటికి ఇండియాలో ఏటా 2లక్షల ఉద్యోగాల కోత ఉంటుందని హెడ్ హంటర్స్ ఇండియా పేర్కొనడం దేశీ ఐటీ ఎంతటి ఒడిదుడుకుల్లో ఉందో స్పష్టం చేస్తోంది.
న్యూఢిల్లీ: భారతీయ ఐటీ గత కొన్నాళ్లుగా ఒడిదుడుకులను చవిచూస్తూనే ఉంది. ఆటోమేషన్ ప్రభావంతో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు కూడా కోల్పోయిన పరిస్థితి. హెచ్1బి వీసాల నిబంధనలతో దేశీ ఐటీ ఉద్యోగులను విదేశాలకు పంపించడం మరింత కష్టంగా మారింది.
తాజాగా ఇదే విషయాన్ని విదేశీ మీడియా కూడా ప్రస్తావించింది. దేశీ ఐటీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించింది. ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో భారతీయ ఐటీ రంగం ఎగుమతులు గత ఏడేళ్లలో కనిష్ట స్థాయికి పేర్కొంది. దీని ప్రభావంతో కరెంట్ ఖాతా లోటు పెరగడమే కాకుండా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, పాలకులకు ఇది ప్రతికూల అంశమని చెప్పుకొచ్చింది.
2014లో కోటి ఉద్యోగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి ఈ ఇబ్బందులు తప్పవని తెలిపింది. హెచ్1బి వీసా నిబంధనలు భారత ఇంజనీర్లు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధంగా ఉన్నాయని చెప్పింది.అటు ఆటోమేషన్ దెబ్బకు 69శాతం ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని వరల్డ్ బ్యాంక్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
దానికి తోడు 2020నాటికి ఇండియాలో ఏటా 2లక్షల ఉద్యోగాల కోత ఉంటుందని హెడ్ హంటర్స్ ఇండియా పేర్కొనడం దేశీ ఐటీ ఎంతటి ఒడిదుడుకుల్లో ఉందో స్పష్టం చేస్తోంది.