తమిళనాడు ఇన్ చార్జ్ గా మెగస్టార్ చిరంజీవి ?
పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై మోడీకి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సమరానికి సిద్దం అయ్యింది. మెగస్టార్ చిరంజీవి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గోంటున్నారని అన్నారు.
చెన్నై: పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సమరానికి సిద్దం అయ్యింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చెయ్యడంతో తమిళనాడులోని ఆపార్టీ నేతలు ఇప్పుడు బిజీ అయిపోయారు.
ఏఐసీసీ సభ్యుడు మెగస్టార్ చిరంజీవి, టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తదితరులు ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈనెల 18వ తేదిన ఆర్ బీఐ శాఖలను ముట్టడించాలని సూచించారు. అయితే 17వ తేదిన ఎంజీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో జల్లికట్టు గొడవ జరుగుతున్న కారణంగా ఈనెల 20వ తేదిన ఆర్ బీఐ శాఖల దగ్గర ఆందోళనలు చెయ్యడం మేలు అని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీకి చెప్పారు.
ఈనెల 20వ తేదిన చెన్నై నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వు బ్యాంకు శాఖలు ముట్టడించి నిరసన వ్యక్తం చెయ్యాలని నిర్ణయించారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాదయాత్రలు చేపట్టి గడపగడపకు తిరిగి ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై నిరసన వ్యక్తం చెయ్యాలని రాహుల్ గాంధీ సూచించారు.
ఈ విషయంపై టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ మాట్లాడుతూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించారని, మాకు మద్దతుగా రాజ్యసభ ఎంపీ మెగస్టార్ చిరంజీవి వచ్చి ధర్నాల్లో పాల్గోంటారని చెప్పారు.
అయితే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర నేతలు అంటున్నారు. అందుకే మోడీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో చిరంజీవిని చురుకుగా పాల్గోనాలని రాహుల్ గాంధీ సూచించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.