బెర్లిన్లో అడుగుపెట్టిన ప్రధాని మోడీ: దేశభక్తి గీతంతో ఆకట్టుకున్న బాలుడు, ప్రవాసుల జోష్
న్యూఢిల్లీ/బెర్లిన్: మూడు రోజుల ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో అడుగుపెట్టారు. బెర్లిన్లోని హోటల్ అడ్లాన్ కెంపిన్స్కీ వద్ద భారీ సంఖ్యలో వేచివున్న ప్రవాస భారతీయులు ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీ వారందరినీ అప్యాయంగా పలకిరించారు.
ప్రవాస భారతీయులతోపాటు చాలా మంది చిన్నారులు అక్కడకు చేరుకుని.. ప్రధాని మోడీతో కరచాలనం చేశారు. కాగా, ఓ భారత సంతతికి చెందిన బాలుడు దేశభక్తి గీతం పాడి ప్రధాని మోడీని ఆకట్టుకున్నారు. బాలుడు పాట పాడుతున్నంత సేపు ప్రధాని మోడీ చిటికెలు వేస్తూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆ బాలుడిపై చేయి వేసి అభినందించారు.
తన చిత్రపటాన్ని బహూకరించిన ఓ చిన్నారితో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. తనకు స్పూర్తి ప్రదాత ప్రధాని మోడీ అని ఆ చిన్నారి పేర్కొంది. కాగా, ఆ చిత్రంపై ప్రధాని మోడీ తన సంతకం చేసి ఇచ్చారు. ప్రధాని మోడీని చూసిన తర్వాత ప్రవాసభారతీయులు వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
#WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm
— ANI (@ANI) May 2, 2022
జర్మనీ పర్యటన సందర్భంగా ఆ దేశ నూతన వైస్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఆరవ ఇండియా-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)ను ప్రధాని మోడీ-ఓలాఫ్ స్కోల్జ్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ భేటీలో ఇరుదేశాలకు చెందిన టాప్ సీఈవోలు కూడా భాగస్వాములవుతారు. జర్మనీలో ఉంటున్న భారతీయులతో ప్రధాని మోడీ భేటీ కావడంతోపాటు వారినుద్దేశించి ప్రసంగించనున్నారు.