"మోడీ-ట్రంప్ ఇద్దరూ ఒక్కటే.." అదెలా అంటే..!
న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు, మహిళలను చులకన చేసే వ్యాఖ్యలతో ఇప్పటికే తన పరువు పోగొట్టుకున్న ట్రంప్ తో భారత ప్రధాని మోడీకి పోలిక తీసుకురావడం ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ కు మద్దతుదారుడైన ఓ వ్యక్తి.. మోడీ గతాన్ని గుర్తు చేస్తూ ind4trump' పేరిట ఓ ఇండియన్ రాసిన ఆసక్తికర కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ లేఖలో అతడు రాసిందేంటంటే.. ' అమెరికన్ ప్రజలారా.. కొన్నేళ్ల క్రితం భారత ప్రధానిపై కూడా చాలానే ఆరోపణలు వచ్చాయి. గుజరాత్ లో అల్లర్లను రెచ్చగొట్టి ముస్లిం హిందూ హత్యలకు కారకుడయ్యాడని అక్కడి విపక్షాలన్ని మోడీపై ఆరోపణలు చేశాయి. మీడియా కూడా ఆయన్ను మైనారిటీల పాలిట రాక్షసుడిగా చూపెట్టింది. కానీ ఇదంతా గతం, రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మోడీ ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం ముస్లింల అభివృద్ది విషయంలో ఆయన చాలానే కష్టపడుతున్నారు. అవినీతికి తావు లేకుండా చేశారు. మోడీ లాగే ఇప్పుడు ట్రంప్ పై కూడా దుష్ప్రచారం జరుగుతోంది. వాటిని ప్రజలెవరూ నమ్మవద్దు, రిపబ్లికన్ పార్టీకే ఓటేసి ట్రంప్ ను గెలిపించండి' అంటూ పిలుపునిచ్చాడు.
ముస్లిం వ్యతిరేకులు అన్న అపవాదు మీడియా కారణంగానే మోయాల్సి వచ్చిందని, నిజానికి ట్రంప్, మోడీలు ఇద్దరు దేశ భక్తులేనని ఇద్దరికీ అసమానా శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సదరు భారతీయుడు తన రాతలతో స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ కథనానికి అమెరికన్ల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నట్లుగా సమాచారం. ఏదేమైనా ట్రంప్ ను మోడీతో పోల్చడం.. అదీ ఓ భారతీయుడు కావడం.. కాస్త ఆశ్చర్యంగానే ఉంది.