ఇటలీ యువతి, భారత టెక్కీ.. చైనాలో కలిశారు, మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు!
చెన్నై: ఎక్కడో ఇటలీలో పుట్టి, చైనాలో ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతి, తమిళనాడులో పుట్టి, ఉద్యోగం నిమిత్తం చైనాకు వెళ్లిన యువకుడు కలిసి జీవితాన్ని పంచుకోవాలని ముందుగానే ఆ విధాత రాసిపెట్టి ఉన్నట్లున్నాడు.
వీరిద్దరి వివాహం ఆదివారం హిందూ సంప్రదాయం ప్రకారం తమిళనాడులోని నాగర్ కోయిల్ లో వైభవంగా జరిగింది. పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని, ముసిముసినవ్వులతో సిగ్గుపడుతున్న తన మనసు దోచిన మగువ మెడలో, బంధుమిత్రుల సమక్షంలో, మేళ తాళాలు మోగుతుండగా, వేదమంత్రాల సాక్షిగా తాళికట్టాడా వరుడు.
చైనాలో ఉన్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఎ.సుబ్రమోని అనే యువకుడికి, చైనాలోనే పని చేస్తున్న ఇటలీకి చెందిన ఫ్లావియా గులియనెల్లీ అనే యువతి ఓ ఈవెంట్ లో పరిచయం అయింది.
వారి పరిచయం తొలుత స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. ఒకరికి ఒకరు సరిజోడని తెలుసుకున్న ఆ జంట, తమిళనాడులో పెళ్లిచేసుకుని ఒక్కటయ్యారు. విశేషం ఏమిటంటే.. ఈ పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలూ అంగీకరించడం.
పెళ్లి తరువాత ఫ్లావియా మాట్లాడుతూ.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, దుస్తులు, కళలు, దేవాలయాలు తనకెంతో నచ్చాయని ఆనందంగా వెల్లడించింది. తానిప్పుడు ధరించిన చీర ఇంకెంతో నచ్చిందని తెలిపింది.