షాక్: ఇండియన్స్కు యూకే వీసాల నిరాకరణ, 6 వేల వీసాల రిజెక్ట్
న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన పలు రంగాల ప్రోఫెషనల్స్కు వీసాలు ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం నిరాకరిస్తోంది. గత ఏడాది డిసెంబర్ నుండి సుమారు 6 వేలకు పైగా యూకే వీసాలను నిరాకరిస్తున్నారు. యూకేకు చెందిన ప్రోఫెషనల్స్కు వీసాలు నిరాకరిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినతరమైన ఆంక్షలను విధించింది. అమెరికాలో ఉన్న స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించేందుకు గాను వీసాల నిబంధనలను కఠినతరం చేసింది అమెరికా సర్కార్.
మరోవైపు యూకే కూడ అదే తరహలో వ్యవహరించడం ఇండియన్ ప్రోఫెషనల్స్కు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. యూకే ఇమ్మిగ్రేషన్ విధానం కారణంగా వీసాలను పొందలేకపోతున్నారని సమాచారం.
ఇండియన్స్ కు యూకే వీసాల నిరాకరణ
భారతీయ ప్రోఫెషనల్స్కు యూకే వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. 2017 డిసెంబర్ నుండి ఇప్పటివరకు సుమారు 6,080 మంది ఇండియన్స్కు యూకే వీసాలు నిరాకరించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఇండియాకు చెందిన ఇంజనీర్లు, ఐటీ ప్రోఫెషనల్స్, డాక్టర్లు, టీచర్లతో పాటు పలు రంగాల్లోని ప్రోఫెషనల్స్కు యూకే వీసాలను నిరాకరిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
57 శాతమే ఇండియన్స్కు యూకే వీసాలు
నైపుణ్యం ఉన్న భారతీయులకు యూకే వీసాలు కేవలం 57 శాతం మాత్రమే దక్కుతున్నాయని సీఏఎస్ఈ అనే సంస్థ గణాంకాలను వెల్లడించింది. యూరోపియన్ వెలుపల నుండి వీసాలు పొందినవారిలో ఎక్కువ విదేశీయుల్లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. కానీ, ప్రస్తుతం యూకే ఇమ్మిగ్రేషన్ విధానంతో కొత్తవారికి ఎక్కువగా యూకే వీసాలు లభ్యం కావడం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
వీసాల సంఖ్యలో తగ్గుదల
టైర్ 2 వీసా కేటగిరిలో భాగంగా కంపెనీలు ఈయూ వెలుపల నుండి ఏడాదికి సుమారు 20వేల 700 మంది విదేశీ ఉద్యోగులను నియమించుకొనే అవకాశాన్ని కల్పించింది. అయితే గడచిన ఆరేళ్ళుగా నెలకు 1600 మంది చొప్పున ఉన్న పరిమితిని కేవలం ఒకే ఒక్కసారికి పెంచారు. కానీ, గత ఏడాది డిసెంబర్ నుండి ఈ పరిమితిని తగ్గిస్తున్నారు. ఈ కారణంగానే 2017 డిసెంబర్ నుండి 2018 మార్చి వరకు సుమారు 6,080 మంది ఇండియన్స్కు వీసాలు నిరాకరించారు.
వీసా విధానంలో మార్పులు
సైన్స్, ఇంజనీరింగ్ , టెక్నాలజీ రంగాల్లో భారత్, యూకేల మధ్య మేధోమదనం, సహాయ సహకారాల వల్ల తాము లాభం పొందామని సీఎఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ నయోమీ వేర్ అభిప్రాయపడ్డారు. కానీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ దెబ్బతిందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సేవలను వినియోగించుకొనేందుకు వీలుగా వీసాలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.