షీనా బోరాను హత్య చేసి క్లబ్ లో మందు పార్టీ
ముంబై: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. షీనా బోరాను హత్య చేసిన తరువాత ఆమె మృతదేహాన్ని తరలించే ముందు ఇంద్రాణి ముఖార్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా ప్రముఖ క్లబ్ లో మందు పార్టీ చేసుకున్నారని సీబీఐ విచారణలో వెలుగు చూసింది.
షీనా బోరా హత్య కేసులో సీబీఐ అధికారులు సంజీవ్ ఖన్నా స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త మంగలేష్ జలన్ (60)ను సీబీఐ అధికారులు విచారణ చేసి పలు వివరాలు సేకరిస్తున్నారు. షీనా హత్య తరువాత 2012 ఏప్రిల్ 25న ఇంద్రాణి ముఖర్జీయా, సంజీవ్ ఖన్నా కోల్ కతా చేరుకున్నారు.
తరువాత కోల్ కతా క్రికెట్ అండ్ ఫుట్ బాల్ క్లబ్ ( సీసీ అండ్ ఎఫ్ సీ)లో ఇద్దరు మద్యం సేవిస్తూ సంతోషంగా తిరుగుతున్న విషయం తాను గుర్తించానని మంగలేష్ జలన్ సీబీఐ అధికారులకు చెప్పాడు. ఆ సమయంలో తాను సంజీవ్ ఖన్నాతో మాట్లాడానని అంటున్నారు.
ముంబైలో ఉన్న తన కుమార్తె నిధిని చూడటానికి వెలుతున్నానని సంజీవ్ ఖన్నా చాల ఉత్సాహంగా చెప్పారని మంగలేష్ జలన్ సీబీఐ అధికారులకు తెలిపారు. ఇంద్రాణి తనకు పెద్దగా పరిచయం లేకపోవడంతో ఆమెతో ఎక్కువ మాట్లాడలేదని అన్నారు.
సీసీ అండ్ ఎఫ్ సీ లో గత 30 సంవత్సరాల నుంచి సంజీవ్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారని ఆ విధంగా ఆయన తనకు పరిచయం ఉన్నాడని మంగలేష్ జలన్ సీబీఐ అధికారులకు చెప్పాడు. క్లబ్ లో తాము మాట్లాడుకుంటామని వివరించాడు.
షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీయా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అదే విధంగా ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
తల్లి కుమార్తెల మద్య ఆస్తి వివాదాలు, తగాదాలు, బెదిరింపులు, రాహుల్ తో ప్రేమ వ్యవహారం తదితర గొడవల కారణంగా ఇంద్రాణి ముఖర్జియా తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిందని సీబీఐ అధికారులు అంటున్నారు.
ఇప్పుడు సంజీవ్ ఖన్నా స్నేహితులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా తాము ఈ కేసులో కీలక ఆదారాలు సేకరించి కోర్టు ముందు సమర్పించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.