తండ్రి బెల్ట్తో కొట్టేవాడు: డ్రైవర్తో ఇంద్రాణి పరారీ
ముంబై: తన కూతురు షీనా బొరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖార్జియా బాల్యం చాలా బాధాకరంగా గడిచినట్లు తెలుస్తోంది. మద్యం సేవించి వచ్చి తండ్రి ఆమెను చిన్నప్పుడు బెల్ట్తో విపరీతంగా కొట్టేవాడని అంటున్నారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఆమె పాఠశాలలో ఉన్నప్పుడు ఫ్యామిలీ డ్రైవర్తో పారిపోయింది. అయితే, ఆమెను పట్టుకుని తిరిగి ఇంటికి తెచ్చారు. బాల్యంలో ఇంద్రాణికి ప్రేమ కరువైందని ఆమె బంధువు ఒకరు చెప్పారు. ఆమె ఆలనాపాలనను కూడా పట్టించుకునే వారు కాదని చెప్పారు.
ఇంద్రాణి తండ్రి ఉపేంద్ర కుమార్ బొరా, ఆయన భార్య దుర్గా రాణి నిత్యం గొడవ పడుతూ ఉండేవారని కూడా ఆ బంధువు చెప్పారు. ఇంద్రాణిని ఇంట్లో పెట్టి, తాళం వేసి వారిద్దరు వెళ్లిపోయేవారని, గంటల తరబడి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వారు మళ్లీ గొడవ పడేవారని అంటున్నారు.
భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో తీవ్ర నిస్పృహకు లోనై తండ్రి ఇంద్రాణిని కొట్టేవాడని అంటున్నారు. ఇంద్రాణి తండ్రి తనను కొట్టే విషయంపై ఇరుగుపొరుగువారికి చెబుతుండేదని సమాచారం. తల్లిదండ్రులు షీలాంగ్కు పంపించిన తర్వాత స్వేచ్ఛ లభించినట్లు ఇంద్రాణి తొలిసారి ఫీలై ఉంటుందని అంటున్నారు.