బైకుల్లా జైల్లో కరోనా: ఇంద్రాణి ముఖర్జీయాతోపాటు 38 మంది ఖైదీలకు పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో కరనావైరస్ జైళ్లలో కూడా విజృంభిస్తోంది. తాజాగా ముంబైలోని బైకుల్లా కారాగారంలో పదుల సంఖ్యలో ఖైదీలు కరోనా బారినపడ్డారు. వీరిలో షీనాబోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీయా కూడా ఉన్నారు. ఈ మేరకు వివరాలను జైలు అధికారులు వెల్లడించారు.
బైకుల్లా మహిళా జైలులో ఇంద్రాణీ ముఖర్జీయాతోపాటు మొత్తం 38 మంది మహిళా ఖైదీలకు కరోనా సోకినట్లు తెలిపారు. 2015లో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీయా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పీటర్ ముఖర్జీయా, సంజీవ్ ఖన్నాలు సహ నిందితులుగా ఉన్నారు. షీనాబోరాను 2012లో హత్య చేయగా, మూడేళ్ల తర్వాత ఈ దారుణం బయటపడింది.

కాగా, మహారాష్ట్రంలో తాజాగా, జైళ్లు, వృద్ధాశ్రమాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల పారమ్ శాంతిధామ్ వృద్ధాశ్రమంలో 58 మంది కరోనా బారినపడ్డారు. ఇక మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 52,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 351 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 39 లక్షలకు చేరువలో ఉంది.
మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా 60వేల కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని, ఆక్సిన్ కూడా దాదా అన్ని ఆస్పత్రుల్లోనూ అందుబాటులో లేకుండా పోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కాగా, బుధవారం నాసిక్లోని జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై 22 మంది మరణించారు. సుమారు 30 నిమిషాలపాటు కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఇది ఇలావుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై, లాక్డౌన్ విధించే అంశంపై బుధవారం రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు.












Click it and Unblock the Notifications