అమ్మింది కొంతే, అది కూడా..: 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి
బెంగళూరు: ఇన్ఫోసిస్కు చెందిన నలుగురు సహ వ్యవస్థాపకులు, వారి కుటుంబ సభ్యులు 6,484 కోట్ల రూపాయల (వంద కోట్ల డాలర్లు) విలువైన షేర్లను సోమవారం ఒక్క రోజే విక్రయించిన విషయం తెలిసిందే. నారాయణ మూర్తి, నందన్ నీలేకని, కె దినేష్ కుటుంబాలతో పాటు ఎస్డి శిబులాల్ భార్య కలిసి 3.26 కోట్ల షేర్లను విక్రయించారు.
ఈ షేర్లు విక్రయించిన విషయాన్ని దీనిని పర్యవేక్షించిన డాయిష్ ఈక్విటీస్ ఇండియా వెల్లడించింది. ఒక్కో షేరును సరాసరి 1,988.87 రూపాయలకు విక్రయించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు సోమవారం ట్రేడింగ్లో 4.76 శాతం నష్టపోయింది. దీంతో మదుపరులకు చెందిన దాదాపు 200 కోట్ల డాలర్ల సొత్తు ఒక్కరోజులో ఆవిరైపోయింది.
దీనిపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. తమ కుటుంబం మా వాటాలో కొంత భాగాన్ని విక్రయించిందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం, దాతృత్వ కార్యకలాపాలకు, ఇతరత్రా అవసరాల కోసం వాటాను అమ్మినట్లు తెలిపారు.
తన జీవిత కాలంలోని తదుపరి దశ ఉత్సాహవంతంగా, ఊపిరిసలపనివ్వకుండా ఉండటం కోసం ఈ కార్యకలాపాలు చేపడుతున్నానని తెలిపారు. ఈ విక్రయం తర్వాత కూడా రిటైల్ మదుపర్లలో తమ కుటుంబమే అతిపెద్ద వాటాదారుగా ఉండబోతుందని, ఇన్ఫోసిస్,క ఆ కంపెనీ నాయకత్వానికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉందని నారాయణ మూర్తి అన్నారు.
ధార్మిక కార్యక్రమాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్కు ప్రోత్సాహ మిచ్చేందుకు కంపెనీ సహవ్యవస్థాపకులు తమ షేర్లను విక్రయించడాన్ని ఇన్ఫోసిస్ సీఈవో సిక్కా స్వాగతించారు. ఈ చర్య కంపెనీ విలువలకు అనుగుణంగా ఉందని ఆయన తెలిపారు.
కాగా, కంపెనీకి చెందని వ్యక్తి సీఈవోగా బాధ్యతలు చేపట్టిన నెలల వ్యవధిలో సహ వ్యవస్థాపకులు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ఏడాది జూన్లో సీఈవోగా సిక్కా నియామకం ఖరారు చేశాక కంపెనీ షేరు దాదాపు 23 శాతం మేర లాభపడింది. 1981లో మూర్తి, నీలేకని, శిబులాల్, దినేష్ సహా ఏడుగురు ఇంజనీర్లు ఇన్ఫోసిస్ను స్థాపించారు.
మూడు దశాబ్దాల తర్వాత వీరంతా తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ విక్రయం ప్రాఫిట్ బుకింగ్ చేసేందుకు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విక్రయంతో లభించిన సొత్తులో కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిసింది.
మూర్తి, ఆయన కుటుంబ సభ్యులు 1.2 కోట్ల షేర్లను(వీరి హోల్డింగ్స్లో 23.3 శాతం), నీలేకని, ఆయన కుటుంబ సభ్యులు 1.2 కోట్ల షేర్లను(వీరి హోల్డింగ్స్లో 31.3 శాతం), దినేష్, ఆయన కుటుంబ సభ్యులు 62 లక్షల షేర్లను(వీరి హోల్డింగ్స్లో 21.5 శాతం), కుమారి శిబులాల్ 24 లక్షల షేర్లను(హోల్డింగ్స్లో 9.6 శాతం) విక్రయించారని డాయిష్ తెలిపింది.