Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇన్ఫీ సంక్షోభం: ఏడాదిగా పరోక్ష యుద్ధం! విజయం మూర్తిదేనా? ఇక ఇప్పుడేం జరుగుతుంది?

భారత్‌కు ఐటీ పాఠాలు నేర్పిన ఇన్ఫోసిస్‌లో ఇప్పుడేం జరుగుతోంది? సగటు మదుపరి ప్రశ్న ఇది. విశాల్‌ సిక్కా రాజీనామాతో అయినా విభేదాలు సద్దుమణుగుతాయా?

న్యూఢిల్లీ: భారత్‌కు ఐటీ పాఠాలు నేర్పిన ఇన్ఫోసిస్‌లో ఇప్పుడేం జరుగుతోంది? సగటు మదుపరి ప్రశ్న ఇది. ఈ కంపెనీకి వ్యవస్థాపకులు ఛైర్మన్‌గా ఉన్నంతకాలం సజావుగా, సాఫీగా కార్యకలాపాలు నడిపిన ఆ దిగ్గజం గత కొద్ది త్రైమాసికాలుగా భారీ కుదుపులకు లోనవుతోంది.

కంపెనీ తొలి వ్యవస్థాపకేతర సీఈవో విశాల్‌ సిక్కా శుక్రవారం రాజీనామా చేయడంతో యావత్‌ కార్పొరేట్‌ రంగం చూపు ఇన్ఫోసిస్‌పైనే నిలిచింది. స్టాక్‌ మార్కెట్‌ లో ఇన్ఫీ షేరు ఒక దశలో 52 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. ఇన్ఫీలో చోటు చేసుకున్న తాజా పరిణామం కంపెనీని ఏ తీరానికి చేరుస్తుందో కాలమే చెప్పాలి.

ఇన్పోసిస్ లో విభేదాలు ఇలా మొదలయ్యాయి...

ఇన్పోసిస్ లో విభేదాలు ఇలా మొదలయ్యాయి...

గతేడాది ఫిబ్రవరిలో కంపెనీ ఎండీ అండ్ సీఈవో విశాల్ సిక్కా వేతనాన్ని 11 మిలియన్ డాలర్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకోవడంతో వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య తొలిసారిగా విభేదాలు పొడసూపాయి. ఆ తర్వాత ఏప్రిల్‌ 2016లో మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సల్‌కు నిష్క్రమణ ప్యాకేజీ రూ.17.38 కోట్లు ప్రకటించడం సహ వ్యవస్థాపకులకు మింగుడు పడలేదు. జూన్‌ 2016లో ఇన్ఫోసిస్‌ మాజీ ఉద్యోగి డి.ఎన్‌. ప్రహ్లాద్‌ను బోర్డులోకి చేర్చమని సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సూచించారు. ఈయన మూర్తి బంధువే. అయితే అక్టోబరు 2016లో కానీ ఆ పని జరగలేదు.

నారాయణమూర్తి విమర్శలతో పతాకస్థాయికి...

నారాయణమూర్తి విమర్శలతో పతాకస్థాయికి...

జనవరి-ఫిబ్రవరి 2017లో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు, ప్రమోటర్లుకు, బోర్డుకు, యాజమాన్యానికి మధ్య కంపెనీ పాలనకు సంబంధించి విభేదాలు పొడసూపాయి. నారాయణమూర్తి తొలిసారిగా బాహాటంగానే ఇన్ఫోసిస్‌ను విమర్శించడం మొదలుపెట్టారు. ఏప్రిల్‌లో రవి వెంకటేశన్‌ను కంపెనీ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. 2015లో పనయా కొనుగోలు వల్ల ఎవరికీ లాభం లేదని మూర్తి తీవ్రంగా విమర్శించారు. దానిపై కంపెనీ దర్యాప్తు చేపట్టినప్పటికీ.. ఆ విషయాలన్నీ ప్రజలకు తెలపాలను జులైలో మూర్తి కోరారు. పనయాపై దర్యాప్తు నిర్వహించామని ఎటువంటి తప్పూ కనిపించలేదని బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌ వెంకటేశన్‌ కూడా ప్రకటించారు. అయినా విభేదాలు సమసిపోక మరింత తీవ్రమయ్యాయి. సిక్కా సీఈఓ కంటే సీటీఓ హోదాకే సరిపోతారని ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు తనతో అన్నట్లు మూర్తి తాజాగా వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మనస్థాపానికి గురైన విశాల్ సిక్కా ఎండీ, సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటూ శుక్రవారం రాజీనామా చేశారు.

ఇన్వెస్టర్లకు షాక్..., మూర్తికి ఏకంగా రూ.1000 కోట్ల నష్టం

ఇన్వెస్టర్లకు షాక్..., మూర్తికి ఏకంగా రూ.1000 కోట్ల నష్టం

విశాల్‌ సిక్కా తీసుకున్న రాజీనామా నిర్ణయంతో ఇన్ఫీ షేరుకు సెగ మామూలు స్థాయిలో తాకలేదు. గురువారం నాటి ‘బైబ్యాక్‌' జోరు శుక్రవారం కూడా కొనసాగుతుందేమో అనుకుంటే భారీ నష్టాలను కళ్ల చూడాల్సి వచ్చింది. ఉదయం రూ.1021.50 వద్ద మామూలుగానే ప్రారంభమైన షేరు ఆ తర్వాత క్రమక్రమంగా నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై రూ.137 (13.38%) నష్టంతో రూ.884.20కు దిగివచ్చింది. ఇన్ఫీ షేరుకు ఇది ఏడాది కనిష్ఠ స్థాయి. చివర్లో కాస్త కోలుకున్నప్పటికీ రూ.98.05 (9.6%) నష్టపోయి రూ.923.10 వద్ద ముగిసింది. తద్వారా సెన్సెక్స్‌, నిఫ్టీ భారీగా నష్టపోవడానికి కూడా కారణమైంది. ఇన్ఫీ షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.22,519 కోట్లు హరించుకుపోయింది. ఇది ఇన్ఫోసిస్‌ మదుపర్లకు ఊహించని షాక్‌. ఈ ప్రకారం చూస్తే ఇన్ఫీలో దాని వ్యవస్థాపకుడైన నారాయణమూర్తికున్న వాటా విలువ కూడా రూ.1000 కోట్లు నిన్నటికి నిన్నే ఆవిరైపోయింది.

మూర్తి ఆరోపణలు నిజం కాదన్న బోర్డు?

మూర్తి ఆరోపణలు నిజం కాదన్న బోర్డు?

ఇన్ఫోసిస్ పాలకులపై దాని వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కొనసాగించిన ఆరోపణల పర్వం వల్లే చివరికి విశాల్ సిక్కా రాజీనామా చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇన్ఫోసిస్ బోర్డు కూడా ఇదే తేల్చింది. అంతేకాదు, ‘మూర్తి వివిధ మీడియా సంస్థలకు ఓ లేఖ రాశారు. బోర్డు సమైక్యతను దెబ్బతీస్తూ అందులో పలు వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌ ప్రమాణాలు పడిపోతున్నాయని యాజమాన్యంపై ఆరోపణలు చేశారు. ఆ లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయి. ఇప్పటికే అవన్నీ సత్య దూరాలని తేలినవే..'అంటూ పేర్కొంది.

పూర్తిగా పరిశీలించకుండానే...

పూర్తిగా పరిశీలించకుండానే...

అయితే ఇన్ఫోసిస్ బోర్డు వివరణను నారాయణ మూర్తి కొట్టిపారేశారు. ప్రపంచ స్థాయి దర్యాప్తు సంస్థలు బోర్డుతో కుమ్మక్కయ్యాయని.. సీఈవో విశాల్ సిక్కాపై వచ్చిన ఆరోపణలను పెద్దగా పరిశీలించకుండానే.. క్లీన్‌ చిట్‌ ఇచ్చేశాయంటూ మళ్లీ మూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన వ్యాఖ్యలను మళ్లీ బోర్డు కొట్టిపారేసింది. మరోవైపు ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ ఆర్‌. శేషశాయి కూడా మూర్తి వ్యాఖ్యానాలపై వివరణ ఇచ్చారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయి ఏజెన్సీలతో దర్యాప్తు చేయించినా.. మూర్తి వాటిని కూడా విశ్వసించకపోవడంపై శేషశాయి విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యాయ, ఫోరెన్సిక్‌ సంస్థలు ఒకటికి రెండు సార్లు దర్యాప్తు చేసినా.. పూర్తిగా పరిశీలించకుండా.. క్లీన్‌ చిట్‌ ఇచ్చాయనడం మాకు సబబుగా తోచడం లేదంటూ ఆయన మూర్తినే తప్పుపట్టారు. ‘ప్రమోటర్లు, సహ వ్యవస్థాపకులు చేసిన ఫిర్యాదులన్నిటిపైనా మేం దర్యాప్తు చేశాం. కార్పొరేట్‌ పాలనలో ఎటువంటి అవకతవకలూ జరగలేదు. ముఖ్యంగా ప్రమోటర్లంటున్నట్లుగా పనయా కొనుగోలులోనూ అది చోటు చేసుకోలేదు. ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడడం, వాటిపై దర్యాప్తు చేయడం బోర్డు బాధ్యత. ఆ పనే బోర్డు చేసింది..' అని ఆయన వివరించారు. అదే సమయంలో మూర్తి ఇటీవల రాసిన లేఖలో చేసిన ఆరోపణలు అవాస్తవాలనీ.. కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయనీ శేషశాయి అన్నారు. ‘మూడు సందర్భాల్లో తప్పులు జరిగాయని మూర్తి చెప్పారు. కానీ దర్యాప్తు ప్రకారం.. అలా జరిగిన దాఖలాలు లేవు..' అని శేషశాయి పేర్కొన్నారు.

నందన్ నీలేకని తిరిగొస్తేనే...

నందన్ నీలేకని తిరిగొస్తేనే...

ఇన్ఫోసిస్‌లో నెలకొన్న తాజా సంక్షోభ పరిస్థితికి తెరపడాలంటే కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకనిని తిరిగి బోర్డులోకి తీసుకొచ్చి, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని ద ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వయిజరీ సర్వీసెస్‌ (ఐఐఏఎస్‌) అభిప్రాయపడింది. ‘ఇన్ఫోసిస్‌ బోర్డు తన సీఈవోకు రక్షణగా నిలవలేకపోయింది. తదుపరి సీఈవోని ఎంపిక చేసేందుకు బోర్డు బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది..'అని ఐఐఏఎస్‌ పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమకు ఇన్ఫోసిస్‌ గుండెకాయ లాంటిది కనుక ఈ బాధ్యతను ఇతర కార్పొరేట్‌ కంపెనీల్లో చేసే ఉద్యోగంగా నీలేకని భావించకూడదని తెలిపింది. ప్రస్తుతం దేశవిదేశాల్లో వెతికినా ఇన్ఫోసిస్‌కు నందన్‌ నీలేకని మాత్రమే అత్యుత్తమ అభ్యర్ధిగా కనిపిస్తున్నారని అభిప్రాయపడింది. ‘అధునాతన సాంకేతికత పరిజ్ఞానం, డిజిటలీకరణ అంశాలపై ఆయనకు పట్టు ఉంది. దేశీయ, అంతర్జాతీయంగా అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్కృతిపై పూర్తి అవగాహన ఉన్నందున ఇన్ఫోసిస్‌కు చెందిన మిగతా వ్యవస్థాపకులను కలుపుకొని పోగలుగుతారు..'అని పేర్కొంది. తాజా పరిణామం ఒక విధంగా ఇన్ఫోసిస్‌కు కుదుపులాంటిదే అయినప్పటికీ బోర్డును బలోపేతం చేస్తే ఈ పరిస్థితి నుంచి తిరిగి బయటపడుతుందని భావిస్తున్నామని ఏంజెల్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసెడెంట్‌ (ఐటీ రీసెర్చ్‌) సర్బజిత్‌ కౌర్‌ నంగర కూడా వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+