హిందూ మహా సముద్రంలోకి భారత్ నయా అస్త్రం.. శత్రు దేశాలకు ముచ్చెమటలు
భారత నౌకాదళ బలం మరింతగా పెరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ భద్రతను శోధించే అత్యాధునిక సర్వే నౌక ఐఎన్ఎస్ సంశోధక్ తన సొంత కేంద్రమైన కొచ్చి నౌకాశ్రయానికి చేరుకుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ అధునాతన సర్వే వెస్సెల్ లార్జ్ విభాగపు నాలుగో నౌక, భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్టాత్మక దక్షిణ నావికాదళం ఆధీనంలోకి ప్రవేశించింది. దీని రాకతో రాబోయే రోజుల్లో సముద్ర అంతర్భాగ పరిశోధనలలో భారత్ సాధించబోయే పురోగతి సరికొత్త మైలురాయిగా నిలవనుంది.
గత నెల జూన్ 21వ తేదీన కోల్ కతాలో జరిగిన చారిత్రాత్మక రక్షణ రంగ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నౌక అధికారికంగా భారత నావికాదళంలో చేరింది. కమిషనింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం, ఐఎన్ఎస్ సంశోధక్ కోల్ కతా నుంచి కొచ్చి వ్యూహాత్మక తీరానికి తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా ఇది తూర్పు తీరంలోని విశాఖపట్నం, చెన్నై రేవులను సందర్శిస్తూ, చివరకు జూలై 5వ తేదీన తన గమ్యస్థానమైన కొచ్చికి చేరుకుంది.
తమ హోమ్ పోర్టుకు చేరుకున్న ఐఎన్ఎస్ సంశోధక్ యుద్ధ నౌకకు అధికారులు, నావిక దళ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. సముద్ర రక్షణ సంప్రదాయాల ప్రకారం ఈ నౌకకు వాటర్ కెనాన్ సెల్యూట్ ఇవ్వడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నేవీ బ్యాండ్ తమ దేశభక్తి గీతాల ప్రదర్శనతో ఈ వేడుకలో ప్రత్యేక జోష్ నింపింది. ఈ గర్వకారణమైన క్షణాలను కళ్లారా చూసేందుకు నౌకలోని సైనికుల కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు.
బహుముఖ వ్యూహాత్మక సామర్థ్యం
ఈ అధునాతన నౌక కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కాకుండా, అనేక రకాల సేవలను అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో అమర్చిన అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషియానోగ్రాఫిక్ సర్వే పరికరాలు సముద్ర గర్భంలోని లోతులు, మార్పులను ఖచ్చితంగా అంచనా వేస్తాయి. అంతేకాకుండా ఇక్కడ ఒకే వేదికపై హెలికాప్టర్ కార్యకలాపాలను నిర్వహించే డెక్ సౌకర్యం కూడా ఉంది. విపత్తుల సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు వీలుగా దీనిని రూపొందించారు.

అత్యవసర పరిస్థితుల్లో ఐఎన్ఎస్ సంశోధక్ ను పూర్తి స్థాయి మొబైల్ ఆసుపత్రి నౌకగా మార్చే సదుపాయం కూడా ఇందులో ఉండడం విశేషం. ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో నౌకా నిర్మాణాన్ని చేపట్టడం రక్షణ రంగానికి ఎనలేని బలాన్ని ఇచ్చింది. ఐఎన్ఎస్ ఇక్షక్ తర్వాత దక్షిణ నావికాదళ పరిధిలోకి వచ్చిన రెండో భారీ సర్వే నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌక సముద్ర మార్గాల భద్రతను పెంచడంలో కీలకపాత్ర పోషించనుంది.












Click it and Unblock the Notifications