ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కిడ్నాప్, హత్య
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన ఓ అధికారిని కిడ్నాప్ చేసిన నిందితులు తరువాత హత్య చేసిన సంఘటన మేఘాలయాలో జరిగింది. అధికారితో పాటు కిడ్నాప్ కు గురైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇన్స్ పెక్టర్ ర్యాంక్ అధికారి అయిన వికాస్ కుమార్ అనే యువకుడు హత్యకు గురైనాడని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. వికాస్ కుమార్ ఇటివలే ఇన్స్ పెక్టర్ ర్యాంకు అధికారిగా నియామకమైనాడు. ఈయన చురుకుగా బాధ్యతలు నిర్వహించేవాడు.
మేఘాలయాలోని పండా అటవి ప్రాంతం దగ్గర గురువారం ఉదయం 9 గంటల సమయంలో వికాస్ కుమార్ తో పాటు మరో వ్యక్తిని టాటా సుమోలో వచ్చిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. తరువాత కిడ్నాప్ కు గురైన ఇద్దరి కోసం సుమారు 100 మంది పోలీసులు, అధికారులు కూబింగ్ నిర్వహించారు.
అయితే శుక్రవారం రాత్రి దక్షిణ గరో కొండల్లో వికాస్ కుమార్ మృతదేహం గుర్తించామని అధికారులు చెప్పారు. కిడ్నాప్ కు గురైన మరో వ్యక్తి ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదని అన్నారు. మేఘాలయాలోని ఏఎస్ఏసీ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.
ఈ ఏఎస్ఏసీ ఉగ్రవాదుల మీద వికాస్ కుమార్ నిఘా వేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఏసీ ఉగ్రవాదులు వికాస్ కుమార్ ను కిడ్నాప్ చేసి హత్య చేశారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు.