భారత్లోనే రాజకీయ శక్తి: జయపై అంతర్జాతీయ పత్రిక, ఉల్లాసంగా 'అమ్మ'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభినందనల్లో ముంచెత్తింది. భారత దేశంలోనే బలీయమైన రాజకీయ శక్తిగా జయను అభివర్ణించింది. జయలలిత ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించిన సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ ఆమె గురించి ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.
కాగా, తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు ఎనిమిది నెలల తర్వాత ఆదివారం తెరుచుకున్నాయి. శనివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయానికి వచ్చారు.
ఆమె కు మంత్రులు, శాసన సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆమె తన కార్యాలయంలో దాదాపు గంటసేపు గడిపారు. పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త పథకాలను ప్రకటించి వాటికి సంబంధించిన ఫైళ్ల పైన సంతకాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 201 అమ్మ క్యాంటీన్లను ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున ప్రజలకు చౌకధరకు విక్రయించే కందిపప్పు, మినపపప్పు పంపిణీని ప్రారంభించారు. తన కార్యాలయంలో ఉన్నంత సేపు ఉల్లాసంగా గడిపారు. ఆమె ఆదివారం నాడు ఐదు పథకాల ఫైళ్ల పైన సంతకాలు చేశారు.
కాగా, జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రతిపక్షం డీఎంకే అప్పీల్ చేయనుంది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై అప్పీల్ చేసే హక్కు తమకుందని డీఎంకే చెబుతోంది. ఈ కేసు విషయంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తుందని ఆసిస్తున్నట్లు చెప్పారు.