యోగాతో ఆత్మబలం..నెగెటివిటీ టు క్రియేటివిటీ: సుఖదుఖ్ఖాలను సమానంగా స్వీకరించే గుణం: మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులలో యోగా ఓ ఆశాకిరణంలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.. యోగా ఫర్ వెల్నెస్ అంశంపై ప్రతి వ్యక్తీ స్పందిస్తోన్నారని, ఏ దేశం కూడా దీనికి అతీతం కాదని చెప్పారు. రుషులు, మునులు, సమత్వం యోగ ఉచ్ఛతే అని ప్రవచించారని గుర్తు చేశారు. సుఖదుఖాల్లో సమనంగా ఉండాలని, సంయమనాన్ని పాటించడానికి యోగాను ఓ పారామీటర్గా మార్చారని, యోగా దాన్ని నిరూపించిందని పేర్కొన్నారు. ధనిక దేశాలు కూడా కరోనా ధాటికి కుదేల్ అయ్యాయని, అలాంటి దేశాలన్నీ ఇప్పుడు యోగాను పాటిస్తోన్నాయని చెప్పారు.
యోగా ఫర్ వెల్నెస్..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. Yoga for wellness అంశంపై మోడీ ప్రసంగించారు. యోగా ప్రాధాన్యతను వివరించారు. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ కాలంలో యోగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుందని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంగా ప్రపంచం నలుమూలలా నెలకొన్న కరోనా సంకట స్థితులన్నీ యోగా ప్రాధాన్యతను చాటి చెప్పాయని పేర్కొన్నారు. ఫలితంగా లక్షలాది మంది కొత్తగా యోగాను అనుసరిస్తోన్నారని చెప్పారు.
ఆత్మబలం..యోగాతో సాధ్యం..
ఆత్మబలానికి నిలువెత్తు నిదర్శనం.. యోగా అని మోడీ అభివర్ణించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లు తమకు తాముగా యోగాను రక్షణ కవచంగా భావించారని చెప్పారు. కరోనా బారిన పడిన పేషెంట్లు ఫ్రంట్లైన్ వర్కర్లు ప్రాణాయామాన్ని నేర్పించారని అన్నారు. యోగా వల్ల శ్వాసకోస ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. అలాగే- తిరువళ్లువర్ సూక్తులను మోడీ ఉటంకించారు. దాని సారాంశాన్ని వివరించారు.
రోగ మూలాలను నయం చేసే శక్తి..
ఎలాంటి రోగాన్నయినా నయం చేయడానికి దాని మూలాలకు వెళ్లాల్సి ఉంటుందని తిరువళ్లువర్ చెప్పారని మోడీ గుర్తు చేశారు. యోగా అలాంటి సాధనమేనని అన్నారు. పలు దేశాలు యోగాపై ప్రయోగాలు కూడా చేస్తోన్నాయని మోడీ పేర్కొన్నారు. యోగాసనాల వల్ల శరీరంపై పడే సానుకూల ప్రభావం ఎలాంటిదనే విషయంపై అధ్యయనాలు సాగుతున్నాయని అన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో తొలి 15 నిమిషాల పాటు విద్యార్థులకు యోగా నేర్పిస్తోన్నారని, ఇది కరోనాపై పోెరాటానికి ఉపయోగపడుతోందని చెప్పారు.
శ్వాసకోస ఇబ్బందులు తొలగిపోవడంలో..
ఆరోగ్యం పరమం భాగ్యం.. స్వాస్థ్యం సరళం సాధనం అని మోడీ పేర్కొన్నారు. యోగా వల్ల శ్వాస సంబంధిత అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. సులభంగా శ్వాసను తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు దరి చేరవని అన్నారు. యోగాలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమౌతుందని నరేంద్ర మోడీ చెప్పారు. అంతఃచేతన వ్యవస్థ ఉత్తేజితమౌతుందని పేర్కొన్నారు. అందుకే- మానసిక, వ్యక్తిత్వ వికాసంలో భారత్కు తిరుగులేదని చెప్పారు.
నెగెటివిటీ టు క్రియేటివిటీ..
యోగా అనేది నెగెటివిటీ నుంచి క్రియేటివిటీకి దారి చూపిస్తుందని మోడీ వివరించారు. కామన్ యోగా ప్రొటొకాల్ అంశంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ యోగా వీడియోలను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేయనుందని మోడీ తెలిపారు. వన్ వరల్డ్..వన్ హెల్త్ కళ యోగాతో సాకారమౌతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లే ఈ యోగాను జాతి, మతాలకు అతీతంగా పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో యోగా వల్ల ఆసక్తి అనూహ్యంగా పెరుగుతోందని చెప్పారు.