ప్రపంచ మానవాళికి భారత్ అందించిన వైద్యకానుక... యోగా
ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. శరీరానికి జబ్బు చేస్తే తగ్గించుకోవచ్చు. మనసుకు జబ్బు చేస్తే ఎలా తగ్గించుకోవాలి? యోగా చేయడంవల్ల శారీరక, మానసిక వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. అదే దాని ప్రత్యేకత. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక సాధన కోసం పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా.
క్రీస్తు శకం 400 సంవత్సరంలో పతంజలి మహర్షి ఈ పుస్తకం రాశారు. 20వ శతాబ్దంలో తిరుమలై కృష్ణమాచారి, అతని శిష్యులు యోగాను అభివృద్ధి చేశారు. శతాబ్దాలుగా మన భారతీయులు యోగాను తమ జైవనశైలిలో ఒక భాగంగా చేసుకున్నారు. యోగా అనే పదం సంస్కృతం నుంచి తీసుకున్నారు. చేరడం లేదా ఐక్యం కావడం అనే అర్థం వస్తుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో భారతదేశ విజ్ఞప్తిని అంగీకరించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీని ప్రకటించింది. ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మైసూరులో జరిగే కార్యక్రమాలకు హాజరవబోతున్నారు. యోగావల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి దీన్ని నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.