ఏది అసహనం?: అమీర్ఖాన్పై అలా, షారుక్పై ఇలా..
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నాలుగు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం నాడు లోకసభలో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన ఎక్కువ మంది మండిపడుతుండగా, విపక్ష నేతలు మద్దతు పలుకుతున్నారు.
అసహనంపై షారూక్ ఖాన్కు మద్దతు పలికిన వారు కూడా పలువురు అమీర్ ఖాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారూక్ అసహనంపై వ్యాఖ్యానించినప్పుడు శివసేన కూడా ఆయనకు అండగా నిలిచింది. బిజెపి నేతలు కొందరు మండిపడితే... శివసేన ఆయన పట్ల అలా వ్యవహరించవద్దని చెప్పింది.
అలాగే, పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా షారూక్ ఖాన్కు అండగా నిలిచారు. కానీ, అమీర్ ఖాన్ విషయంలో.. శివసేన, ఎక్కువ మంది బాలీవుడ్ స్టార్లు సహా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసహనం వల్ల తన భార్య దేశం విడిచి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేసిందన్న అమీర్ ఖాన్ వ్యాఖ్యలను చాలామంది తప్పుపడుతున్నారు.
ఆ వ్యాఖ్యల ప్రభావం ఆయన అంబాసిడర్గా ఉన్న ఈ కామర్స్ బిజినెస్ దిగ్గజం స్నాప్డీల్ పైన కూడా పడటంతో.. వారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏడెనిమిది నెలలుగా 'అసహనం' అంటూ పలువురు సాహితీవేత్తలు నిరసన వ్యక్తం చేస్తూ, అవార్డులు వెనక్కిస్తున్నారు.
వారిపై బిజెపి నేతలు, వారిని సమర్థించేవారు మండిపడ్డారు. విపక్షాలు, వారి అనుకూలురు అవార్డులు వెనక్కి ఇచ్చే వారిని సమర్థించారు. బీహార్ ఎన్నికల కోసమే అసహనం అనే అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని బిజెపి నేతలు చెప్పడం వేరే విషయం.
అయితే, దేశం వదిలి వెళ్లిపోతానని అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలనే చాలామంది తప్పుపడుతున్నట్లుగా అర్థమవుతోంది. అందుకే, షారుక్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన చాలా ఎక్కువగా వ్యతిరేకత వచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో రకాలుగా నిరసన వ్యక్తం చేయవచ్చునని చెబుతున్నారు.
'అద్భుత భారత్' 'అసహన భారత్' ఎప్పుడైందని బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్ను ప్రశ్నించారు. భారత్ చాలా సహనవంతమైన దేశమని, అందరూ ఇక్కడ సమానమేనని, హిందువులు మెజార్టీగా ఉన్న దేశంలో ముగ్గురు స్టార్లు ఖాన్లు కావడమే ఇందుకు నిదర్శనమని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
భారత్ అత్యంత సురక్షిత దేశమని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ చెప్పారు. ఓ ఆంగ్ల ఛానల్ బిజెపి నేత షాన్ వాజ్ హుస్సేన్, అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై ఓటింగ్ నిర్వహిస్తే... ఎనభై ఆరు శాతం మంది బిజెపి నేత వ్యాఖ్యలతో ఏకీభవించారు. అత్యంత సురక్షిత దేశం భారత్ అన్న బిజెపి నేత వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవించారు.
కొందరు బిజెపి నాయకులు అయితే అమీర్ ఖాన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లవచ్చునని, దేశ జనాభా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. అయితే, బిజెపి ముఖ్య నేతలు మాత్రం.. అమీర్ ఖాన్ మాట్లాడే ముందు ఆలోచించి వ్యాఖ్యానిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
పలువురు ప్రముఖులు, ఇంటర్నెట్లో నెటిజన్లు.. అమీర్ ఖాన్ వ్యాఖ్యల పైన వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. సిరియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్.. ఎక్కడకు వెళ్తారని ఎద్దేవా చేశారు. ఇతర ఏ దేశాల్లోను ప్రశాంతత ఉండదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, అమీర్ ఖాన్ను వెనుకేసుకొచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే, ప్రతిపక్షాలు ఆయనను ఎక్కువగా వెనుకేసుకొచ్చాయి. బిజెపిని వ్యతిరేకిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ తదితరులు అమీర్ ఖాన్ వ్యాఖ్యలను సమర్థించారు.
అమీర్ ఖాన్కు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని వారు చెబుతున్నారు. అమీర్ ఖాన్ కూడా బుధవారం తన వ్యాఖ్యలపై స్పందిస్తూ... నేను చేసిన వ్యాఖ్యలకు చాలామంది ఘాటుగా స్పందించారని, ఇదే అసహనానికి నిదర్శనం అని చెప్పారు.
అయితే, సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇచ్చినప్పుడు, ఇతర నేతలు అసహనం అని వ్యాఖ్యానించిన సందర్భాల్లో రాజకీయ నేతల మధ్యనే ఎక్కువగా వాగ్యుద్ధం నడిచిందని, సామాన్యుల్లో చర్చ మాత్రమే ఎక్కువగా జరిగిందని, కానీ అమీర్ ఖాన్... దేశం విడిచి వెళ్లిపోతాననే వ్యాఖ్యానించడంతో నెటిజన్లు సహా చాలామంది తీవ్రంగా స్పందించారని గుర్తు చేస్తున్నారు.
కాగా, మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందునే ఉద్దేశ్యపూర్వకంగా మత అసహనం అంటూ తెరతీశారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. గత యూపీఏ హయాంలోని మత ఘర్షణలు జరిగాయని, ఇప్పుడే వీరంతా అసహనం అంటూ రావడం వెనుక మోడీ ప్రధానిగా ఉండటమేనని బిజెపి చెబుతోంది.
ఇదిలా ఉండగా, మద్రాస్ హైకోర్టు జడ్జి అమీర్ ఖాన్ వ్యాఖ్యలను సమర్థించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, తన భార్య - తన మధ్య జరిగిన సంభాషణను ఆయన ప్రజలతో పంచుకున్నారని జడ్జి చెప్పారు. జస్టిస్ హరిపరంధామన్... బాలీవుడ్ నటుడి వ్యాఖ్యలపై స్పందించారు.