IPL 2021 Auction: క్రిస్ మోరిస్ను రూ.16.25 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్... ఇంకా ఎవరెవరు ఎంత పలికారంటే...
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంలో ఈసారి రికార్డులు బద్ధలయ్యాయి. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ లీగ్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ధర పలికాడు.
గురువారం చెన్నైలో జరిగిన వేలంలో మోరిస్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.16.25 కోట్లకు మోరిస్ దక్కించుకుంది.
ఆల్రౌండర్ మోరిస్...
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్నింటిలోనూ మేటిగా మోరిస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడటంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్ల్లో ఆడిన అనుభవం అతడి సొంతం. మోరిస్ వయసు 33 ఏళ్లు.
మోరిస్ వేలం రూ.75 లక్షల వద్ద మొదలైంది. మొదట ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాడి కోసం పోటీపడ్డాయి. వేలం రూ.10.75 కోట్లకు పెరిగిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ రంగంలోకి దిగింది. రికార్డు ధరకు అతడిని సొంతం చేసుకుంది.
దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా క్రిస్ మోరిస్ రికార్డు సాధించాడు. ఇదివరకు ఈ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. అతడు 2015లో రూ.16 కోట్లకు అమ్ముడయ్యాడు.
- IPL 2021: నేడే ఆటగాళ్ల వేలం పాటలు... ఈసారి కాసుల వర్షం ఎవరిపై కురియనుంది?
- సురేశ్ రైనా అత్తమామలపై దాడి.. ఐపీఎల్ నుంచి వైదొలగడానికి కారణం ఇదేనా?
అత్యధిక ధర పలిగిన ఆటగాళ్లలో మోరిస్ తర్వాతి స్థానం ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ది. అతడిని రూ.14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. హార్డ్ హిట్టర్గా మ్యాక్స్వెల్కు మంచి పేరు ఉంది. స్పిన్ బౌలింగ్తోనూ అతడు జట్టుకు కలిసివస్తాడు. మంచి ఫీల్డర్ కూడా. అయితే, అతడు స్థిరంగా రాణించలేకపోతున్నాడు. అందుకే కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాక్స్వెల్ను వదులుకుంది. ఇదివరకు అతడు ముంబయి, దిల్లీ జట్లకు కూడా ఆడాడు.
మ్యాక్స్వెల్ను కొనుక్కునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ పోటీపడ్డా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంలో అతడిని దక్కించుకుంది.
ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ను రూ.2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్కించుకుంది. ఇదివరకు స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్గా స్మిత్ విఫలమవ్వడంతో ఆ జట్టు అతడిని వదులుకుంది. అయితే, అతడికి నాయకత్వ పటిమ ఉంది. ఎలాంటి పిచ్పైనైనా పరుగులు రాబట్టగలడు. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు.
- క్రికెట్ 'ఉక్కు మనిషి' సీకే నాయుడు
- 'సచిన్ అందరికీ క్రికెట్ దేవుడు... కానీ, నాకు మాత్రం కొడుకులాంటి వాడు'
ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పంజాబ్తో పోటీపడి రూ.7 కోట్లకు దక్కించుకుంది. భారత బౌలింగ్ ఆల్రౌండర్ శివమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.4.4 కోట్లకు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను కోల్కతా నైట్రైడర్స్ జట్టు రూ.3.2 కోట్లకు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.
మరోవైపు హైదరాబాదీ బ్యాట్స్మన్ హనుమ విహారీ వేలంలో అమ్ముడవ్వలేదు. రూ.1 కోటి బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడిపై ఏ జట్లూ ఆసక్తి చూపలేదు.
ఇదివరకటి వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే...
- 2008- మహేంద్ర సింగ్ ధోని (రూ.6కోట్లు)
- 2009- ఆండ్ర్యూ ఫ్లింటాఫ్, కెవిన్ పీటర్సన్ (చెరో రూ.7.35 కోట్లు)
- 2010- కీరన్ పోలార్డ్, షేన్ బాండ్ (చెరో రూ.3.4 కోట్లు)
- 2011- గౌతమ్ గంభీర్ (రూ.11.4 కోట్లు)
- 2012- రవీంద్ర జడేజా (రూ.9.2 కోట్లు)
- 2013- గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ.5.3 కోట్లు)
- 2014- యువరాజ్ సింగ్ (రూ.14 కోట్లు)
- 2015- యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు)
- 2016- షేన్ వాట్సన్ (రూ.9.5 కోట్లు)
- 2017- బెన్ స్టోక్స్ (రూ.14.5 కోట్లు)
- 2018- బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు)
- 2019- జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి (చెరో రూ.8.4 కోట్లు)
- 2020- ప్యాట్ కమిన్స్ (రూ.15.5 కోట్లు)
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2020 వేలం: పాట్ కమిన్స్ను రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా
- "ప్రవాస భారతీయులను భారత్తో మమేకం చేసేది క్రికెటే"
- క్రికెట్కు యువరాజ్ సింగ్ గుడ్బై
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- కాలు లేకపోయినా క్రికెట్లో సూపర్స్టార్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)