IPL 2023 : ముంబైపై అర్ష్ దీప్ చెత్త బౌలింగ్ తో ప్రపంచ రికార్డు బద్దలు-మరో రికార్డు కూడా..
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన ఐపీఎల్ లీగ్ పోరు అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. అదే సమయంలో ఓ చెత్త ప్రపంచ రికార్డు కూడా వేదికైంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ విసిరిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ అలవోకగా ఛేదించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లింది. దీంతో పాటు గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఇరు జట్లూ కలిపి 431 పరుగులు సాధించారు. అదే సమయంలో పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ తన కెరీర్ లోనే చెత్త గణాంకాలు నమోదు చేసుకోవడంతో పాటు అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చాడు. గతంలో ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా వికెట్లు ఇరగొట్టే బౌలింగ్ చేసిన అర్ష్ దీప్ ఈ మ్యాచ్ లో మాత్రం బ్యాటర్ల షాట్లకు బలిపశువయ్యాడు.

ఈ ఎడిషన్కు ముందు ఒక్కసారి కూడా 50 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వని లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్.. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆల్ టైమ్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ముంబైతో పోరులో అర్ష్ దీప్ సింగ్.. ఓ టీ20 మ్యాచ్లో 4 ఓవర్ల పూర్తి కోటాను పూర్తి చేయకుండానే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. అర్ష్దీప్ 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఐపీఎల్ లో ఓ మ్యాచ్ లో వికెట్లు లేకుండానే అత్యధిక పరుగులిచ్చిన చెత్త రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
ఇలా వికెట్లు తీయకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో బెన్ వీలర్ 3.1 ఓవర్లలో 64 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. అలాగే టామ్ కుర్రాన్, పాట్ బ్రౌన్, అలెక్స్ డిజిగాలు తమ నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయకుండానే 63 పరుగులు ఇచ్చారు. అలాగే అర్ష్దీప్ ఐపీఎల్ లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఐదో బౌలర్ గా నిలిచాడు. 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన బాసిల్ థంపీ నాలుగు ఓవర్లలో 70 పరుగులిచ్చి ఆ చెత్త రికార్డుల్లో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత గుజరాత్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రింకూసింగ్ ఐదు సిక్సర్లు కొట్టిన చివరి ఓవర్లో 31 పరుగులిచ్చిన యష్ దయాళ్ ఆ మ్యాచ్ లో మొత్తం 69 పరుగులిచ్చాడు.












Click it and Unblock the Notifications