విజయ్ ర్యాలీ వ్యవహారంలో అనూహ్య పరిణామం..!!
TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆ పార్టీ నాయకులతో గొడవకు దిగిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి ఈషా సింగ్ పై బదిలీ వేటు పడింది. ఉన్నపళంగా ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామం తమిళనాడు, పుదుచ్చేరి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీవీకేకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
పార్టీని విస్తరించే క్రమంలో కిందటి నెల విజయ్.. పుదుచ్చేరిలో పర్యటించిన విషయం తెలిసిందే. కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన మొదటి బహిరంగ సభ ఇది. ఆ సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ప్రసంగాన్ని ఈషా సింగ్ అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతుండగానే మైక్ లాక్కున్నారు. మైక్ లాక్కోవడానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ ఘటనతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

పుదుచ్చేరిలోని ఉప్పలం ఎక్స్పో గ్రౌండ్లో ఈ సభ ఏర్పాటైంది. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు విధించింది ప్రభుత్వం. బుస్సీ ఆనంద్ మాత్రం మైక్ లో మాట్లాడుతూ ఎటువంటి పరిమితులు లేవని, ఇంకా స్థలం చాలా మిగిలివుందని ప్రజలను ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఇషా సింగ్ వెంటనే జోక్యం చేసుకున్నారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. మైక్ లాక్కున్నారు.
మీ చేతులకు చాలా మంది రక్తం అంటింది. 40 మంది చనిపోయారు. మీరేం చేస్తున్నారు?" అని నిర్వాహకులను ప్రశ్నించారు. అనుమతించిన సంఖ్యకు మించి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. లేడీ సింగంగా ఆమెను అభివర్ణించింది సోషల్ మీడియా. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలను ధైర్యంగా అమలు చేసినందుకు ప్రశంసించింది.
ఇప్పుడు తాజాగా ఆమె బదిలీ కావడం చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో పని చేస్తోన్న మొత్తం 31 మంది ఐఎఎస్, 18 మంది ఐపీఎస్ అధికారులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బదిలీ చేసింది. 1998లో ముంబైలో జన్మించిన ఇషా సింగ్ తండ్రి యోగేష్ ప్రతాప్ సింగ్ కూడా ఐపీఎస్ అధికారే. తల్లి అభా సింగ్.. ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిణి. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. ఇషా కూడా బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ విద్యార్థిని.












Click it and Unblock the Notifications