హార్మూజ్ ను దాటే నౌకలను పేల్చేస్తున్న ఇరాన్.. భారత్ కు చెందిన 15 నౌకలు..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా బృందాల మధ్య ఇటీవల జరిగిన చర్చలు విఫలం కావడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యాయి. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్లోజ్ చేసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తాజాగా ఓపెన్ చేసింది. కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22 వరకు ఉండటంతో ఆ గడువు ముగిసేంత వరకూ వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించుకోవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటన చేశారు.
అయితే తాజాగా మరోసారి హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసినట్లు ఇరాన్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా హార్మూజ్ జలసంధిని దాటిన నౌకలను ఇరాన్ కు చెందిన గన్ బోట్స్ పేల్చేస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండా ఇరాన్ గన్ బోట్స్ నౌకలపై కాల్పులు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఒమన్ కు నార్త్ ఈస్ట్ ప్రాంతంలో 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ గన్ బోట్స్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల్లో ఆ నౌకలోని సిబ్బంది సురక్షితంగానే బయటపడినట్లు సమాచారం.
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్- అమెరికా పెత్తనం చెలాయిస్తున్నాయి. ఓ వైపు హార్మూజ్ ను పూర్తిగా దిగ్బంధనం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిలోని క్వీషమ్, లారక్ ఐలాండ్స్ వద్ద కొన్ని నౌకలు ముందుకు సాగకుండానే వెనక్కి తిరిగిరావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ఒమన్ సమీపంలో ఓ నౌకపై ఇరాన్ కు చెందిన రెండు గన్ బోట్స్ కాల్పులు జరపడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదే విషయంపై ఆ నౌక కెప్టెన్ మాట్లాడుతూ.. తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండానే ఇరాన్ గన్ బోట్స్ తో కాల్పులు జరిపిందని తెలిపారు. ఇదే విషయాన్ని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం నౌకలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇరాన్ నేవీ నుంచి ఆ నౌకకు రేడియో మెసేజ్ లు వచ్చినట్లు సమాచారం.. అందులో.. అమెరికా ప్రభుత్వం తప్పిదం కారణంగా నౌకలను హార్మూజ్ నుంచి పంపించడంలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తోందని తెలిపినట్లు సమాచారం.

మరోవైపు భారత్ కు చెందిన 15 వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధిలోనే చిక్కుకున్నట్లు సమాచారం. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇవి హార్మూజ్ ను దాటలేకపోతున్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్ కు చెందిన కొన్ని ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి గుండా సురక్షితంగా వెళ్లినప్పటికీ తాజా దిగ్బంధం తర్వాత పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారినట్లు స్పష్టం అవుతోంది. ఇక హార్మూజ్ వద్ద చిక్కుకున్న భారత్ నౌకలను సాధ్యమైనంత వరకూ స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications